అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది

– 800 రోజుల రాజధాని పోరాటానికి అభినందనలు
-టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని గా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజలకు అభినందనలు. మీ ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం.

తన మూర్ఖపు వైఖరి తో రాష్ట్రం లో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదు. రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే….ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. రాజధాని విషయం లో నిలకడ లేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైసిపి ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికే శాపంలా మారింది.

ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. దేశ చరిత్ర లో నిలిచి పోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది.