– కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సమీక్ష
– లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై రివ్యూ
– 10 అంశాలపై ఐవీఆర్ఎస్తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ
– పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరణ
– పింఛన్లు పంపిణీపై 90.20 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి
– ధాన్యం సేకరణలో 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి..
– గోనె సంచుల విషయంలో 30 శాతం అసంతృప్తి
– దేవాలయాల్లో దర్శనాలపై 70 శాతం మంది సంతృప్తి
– వసతులపై 37 శాతం భక్తుల్లో అసంతృప్తి
– పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు
– ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సేవలపై 35 శాతం అసంతృప్తి
– అవినీతిపై 37 శాతం ఫిర్యాదు
అమరావతి: ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి, ప్రతి విభాగం పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష చేశారు. ప్రభుత్వ సేవలపై నేరుగా లబ్ధిదారులు ఏమంటున్నారు అనే అంశంపై ఐవిఆర్ఎస్తో పాటు వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహించారు.
ఈ సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం శాఖల వారీగా సమీక్ష చేశారు. ఎవరు ఏం చెప్పినా లబ్ధిదారుల మాటే ఫైనల్ అని, ప్రజలు క్షేత్ర స్థాయి నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్నే ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి వరకు విధానాల అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవ్వడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఆ శాఖల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
ఇదే సమయంలో కొన్ని శాఖల్లో ఏడు నెలల కాలంలో అనుకున్న స్థాయిలో మార్పు రాకపోవడంపై సీఎం లోతుగా సమీక్షించారు. కారణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మార్పులు తేవాలని అధికారులకు సూచించారు. మొత్తం 10 అంశాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా సమీక్ష నిర్వహించిన సీఎం… ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో 1 శాతం కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సూచించారు.
సీఎంకు అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లో వివరాలు
పింఛన్లు పంపిణీ
1వ తేదీన ఇంటివద్దే ఫింఛన్ అందుతుందా అనే ప్రశ్నకు 90.20 శాతం మంది లబ్ధిదారుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. పింఛను అందించిన ఉద్యోగుల ప్రవర్తనపై 87.48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మీరు పింఛను తీసుకుంటున్నప్పుడు అవినీతి గమనించారా అన్న ప్రశ్నకు…15.60 శాతం మంది అక్కడక్కడా అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేశారు.
అన్న క్యాంటీన్
అన్న క్యాంటీన్లో పారిశుద్ధ్యంపై 82 శాతం మంది, ఆహారంలో నాణ్యతపై 91 శాతం మంది, సమయపాలనపై 84 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణ విధానంపై 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గోనె సంచుల విషయంలో 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతకు తగ్గ ధర లభించిందని 84 శాతం మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దేవాలయాల్లో దర్శనాలు
రాష్ట్రంలోని ఏడు ఆలయాల్లో దర్శనాల తీరుపై సర్వే నిర్వహించగా 70 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వసతులపై 37 శాతంమంది భక్తుల్లో అసంతృప్తి కనిపించింది. ప్రసాదంపై మాత్రం 81 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. గతకొద్ది కాలంగా తీసుకున్న చర్యలతో ఈ విషయంలో సంతృప్తి పెరిగింది.
ఎన్టీఆర్ వైద్య సేవ
ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆసుపత్రుల్లో అడ్మిషన్పై 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. సేవల విషయంలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యమిత్రల పనితీరుపై 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులు
వైద్యులు, సిబ్బంది అందుబాటుపై 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి జరుగుతుందని 37 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీపం 2
దీపం-2 పథకంలో భాగంగా సిలిండర్ అందుకున్న 48 గంటల్లో డబ్బులు తమ అకౌంట్లలో జమ అవుతున్నాయని 48 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి నిర్థేశిత సమయంలో డబ్బులు అకౌంట్లో పడేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ఆర్టీసీ
ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం అని 88 శాతంమంది భావిస్తున్నారు. అయితే, గమ్యస్థానాలను నిర్థేశించిన సమయానికి చేరుకునే విషయంలో 27 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్స్టాండ్లలో మౌలిక వసతులపై 63 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని సీఎం అధికారలుకు సూచించారు. ఇసుక లభ్యతపై 78 శాతం మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79 శాతం, రవాణా ఛార్జీలపై 75 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని…. నూరు శాతం సంతృప్తి కనిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.