– రుణాలు తీసుకున్న 19 లక్షల రైతులకే బ్యాంకులు బీమా
– మరి మిగిలిన రైతులందరి పరిస్థితి ఏమిటి?
– రెండేళ్లుగా ఏ సీజన్లోనూ ప్రీమియమ్ కట్టని ప్రభుత్వం
– దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి
– అందుకే ఇది కచ్చితంగా ‘మ్యాన్ మేడ్ కలామిటీ’
– ఈ 16 నెలల్లో ఎప్పుడూ రైతులకు ఏదో ఒక కష్టం
– కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
– మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
తాడేపల్లి: మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పార్లీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీశారు.
తుపాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడడాన్ని ప్రశంసించిన ఆయన, ఇప్పుడు పంట నష్టం అంచనాల్లో ఎక్కడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు. పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా, గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆయన ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఈరోజు కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలు ఇచ్చినప్పుడు, ఇన్సూరెన్స్ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? 85 లక్షల రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ?
ఇప్పుడు కేవలం 19 లక్షల రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ? దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియమ్ కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ కలామిటీ (మానవ తప్పిదం వల్ల సంభవించిన నష్టం). కాబట్టి మనం పార్టీపరంగా వారికి అండగా నిలబడాలి.
ఇంకా ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో ఎప్పుడూ రైతులకు ఏదో ఒక సమస్య. అయినా వారిని ఏ విధంగానూ ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చివరకు పంటల ఈ–క్రాప్ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్క ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
అందుకే ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలబడాలి. అంటే పంట నష్టం అంచనాలో మనం రైతులకు తోడుగా నిలబడాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా, వారి తరపున నిలబడాలి. మాట్లాడాలి. అలా వారి తరపున మనం పని చేయాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పార్టీకి సంబంధించిన వారు కానీ.. ఎవరూ కూడా ఎక్కడా మిస్ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే.. వాటిని గట్టిగా ప్రశ్నించాలి. అలా రైతులకు మంచి జరిగేలా చూడాల్సి ఉంది. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా చూడాలి. ఆ దిశలో పూర్తి చొరవ చూపాలి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమం అక్టోబరు 28న అనుకున్నా, మొంథా తుపాన్ వల్ల వాయిదా వేయడం జరిగింది.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కెకె రాజు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కెవి ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
కాగా, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డితో పాటు, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్ తదితరులు కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.