విజ్ఞతతో హైకోర్టు తీర్పు అమలు చేయాలి

– రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ వైకాపా ప్రభుత్వం ప్రజలను పదేపదే మోసగిస్తారా
– పేదలకు మూడు ఇళ్లు కట్టలేని, మూడు లెట్రిన్లు కట్టలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తుందా?
– విభజన చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 94(3), సెక్షన్ 94(4), 13వ షెడ్యూల్ లోని 11వ అంశం ప్రకారంగా అంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని మాత్రమే ఉండాలి
– ఏ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి

విజయవాడ : రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ వైకాపా ప్రభుత్వం ప్రజలను పదేపదే మోసగించడం శోచనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. దేశానికి ఒకే రాజధాని ఉంది. అది న్యూఢిల్లీ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక రాజధాని మాత్రమే ఉంది.

ఏపి కంటే నాలుగు రెట్లు పెద్దదైన యూపి కి కూడా ఒకే రాజధాని ఉందని, పీఎం స్వరాష్ట్రం గుజరాత్ కి కూడా ఒకే రాజధాని ఉందని, అభివృద్ధి చెందిన కేరళ రాష్ట్రానికి కూడా ఒకే రాజధాని ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

విభజన చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 94(3), సెక్షన్ 94(4), 13వ షెడ్యూల్ లోని 11వ అంశం ప్రకారంగా అంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని మాత్రమే ఉండాలని, కాబట్టి మూడు రాజధానుల నిర్మాణం అసంభవం….అసంభవం అని పునరుదాటించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని, రోడ్ల మీద గుంతలు పుడ్చలేని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని తులసి రెడ్డి విమర్శించారు.

పేదలకు మూడు ఇళ్లు కట్టలేని, మూడు లెట్రిన్లు కట్టలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తుందా! అని ఆయన ప్రశించారు. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా జగన్ ప్రభుత్వ వాలకం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి హైకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply