నందమూరి తారక రామారావు.. తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు.. ప్రపంచంలో ఏ మూలాన ఉన్న తెలుగు వారికైనా ‘అన్న’ అనే పదం వినబడితే చాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫురణకు వస్తారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన మహనీయుడు ఆయన.. సామాన్యుడుకి సగం ధరకే జనతా వస్త్రాలు కట్టబెట్టిన అసమాన్యుడు ఆయన.. అట్టడుగు వర్గాల వారికి పక్కా ఇళ్ళు కట్టించిన ప్రజా నాయకుడు ఆయన.. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ.. నినాదంతో దేశానికి సంక్షేమ పధకాల మార్గదర్శనం చేసిన దార్శనీకుడు ఆయన.. తెలుగు సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడుగా.. దర్శకునిగా.. నిర్మాతగా ప్రజా హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్ రాజకీయాలలోను రాజీ లేని తనదైన ముద్ర వేశారు. భౌతికంగా మనకు దూరమైనా మన మనసులలో చిరంజీవిగా కొలువై ఉన్నారు ఎన్టీఆర్.
1928 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ సినీ రంగంలో స్వయంశక్తితో ఎదిగి మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అనతికాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన అధికార దర్పంతో కాకుండా పేదల పట్ల ఆపేక్షతో తన బాధ్యతలు నిర్వహించారు.1996 జనవరి 18న ఆయన భౌతికంగా మనకు దూరమయ్యారు.
తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు.. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయారు ఎన్టీఆర్.
నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెర దించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలు, 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు.
నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి.
ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ‘ససేమిరా’ అన్నారు. మీసాలతోటే నటించడం వలన అతనికి “మీసాల నాగమ్మ” అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్నారు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవారు.
ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో ‘చేసిన పాపం’ వంటి ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనికి బహుమతి కూడా వచ్చింది. తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకు పోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసే వారు కాదు ఆయన.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యారు. తదనంతరం మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచారు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతన్ని మద్రాసు పిలిపించి ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసారు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా ‘మనదేశం’ అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అంచేత అతను మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు.
1950లో ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు ‘షావుకారు’ కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశారు. థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ ఉండేవారు. తరువాతి కాలంలో ఆయన నిర్మాత అయ్యారు. 1951లో కె.వి.రెడ్డి ‘పాతాళభైరవి’, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్.రెడ్డి ‘మల్లీశ్వరి’, 1952లో ఎల్వీ ప్రసాదు ‘పెళ్ళిచేసి చూడు’, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం ‘చంద్రహారం’ ఎన్టీఆర్ కు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయా వారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు.
‘పాతాళభైరవి’ 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956 లో విడుదలైన ‘మాయాబజార్’లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం. ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసారు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాట పర్వములో ఎన్టీఆర్ ఐదు పాత్రలు పోషించారు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు.
సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన ‘సీతారామ కళ్యాణం’. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని “నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు” పతాకంపై విడుదల చేసారు. 1977లో విడుదలైన ‘దాన వీర శూర కర్ణ’లో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసారు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు ‘అడవిరాముడు’, ‘యమగోల’ గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి, దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ 1990లో విడుదలైంది.
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవారు. ‘నర్తనశాల’ సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు. ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవారు.
విశ్వ విఖ్యాత, నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన రామారావు తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రికాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968లో భారత ప్రభుత్వం నుండి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ ‘ స్వీకరించారు.
1978లో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించే వారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
1981లో ఊటీలో ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి.. “మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా?” అని అడిగారు. దానికి జవాబుగా.. “నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజు నుంచి నా వంతుగా ప్రతీనెలలో 15 రోజులు తెలుగుప్రజల సేవ కోసం కేటాయిస్తాను” అని చెప్పారు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేశారు.
1982 మార్చి 21న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు అతనికి ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు. దానికి ఆయన “చైతన్యరథం” అని నామకరణం చేశారు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.
ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడి వలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించి వేసిన ప్రచార ప్రభంజనమది.
ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నారు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్ర పదజాలంతో విమర్శించాడు.
కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు అతని నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.
1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అతని విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి.
1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహతంగా సాగిపోయింది. అయితే అతను రాజకీయ జీవితం అలా, నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణల కారణంగానూ, ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వల్లనూ, ఆ రెండు పార్టీల మధ్య వైరి భావం పెరిగింది. రాజకీయ పార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శతృత్వ భావన నెలకొంది. ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్రప్రదేశ్ కు.. కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. “కేంద్రం మిథ్య” అనేంత వరకు ఎన్టీఆర్ వెళ్ళారు.
1983 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ఆయన కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఆయనకు గల ప్రజాభిమానంతో ఈ వ్యతిరేకతలను ఆయన అధిగమించారు.
1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు అతనికి ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబరు 16న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది.
ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమారంగంలో “స్లాబ్ విధానము”ను అమలుపరిచారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేశారు.
1985 జూన్ 1న అధికారికంగా మండలి రద్దయింది. హైదరాబాదులోని హుస్సేన్సాగర్ కట్ట ట్యాంకుబండ్ పై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.
1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్య పాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నారు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది.
కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.
1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీ చేతిలో అవమానాలు పొందారు. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో ఉండేదంటే – ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభ నుండి బహిష్కరించారు. ఈ కాలంలో ఎన్టీయార్ నాలుగు సినిమాలలో నటించారు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఈ పెళ్ళి కారణంగా అతని వ్యక్తిగత జీవితంపై, కుటుంబ సభ్యులతో అతని సంబంధాలపై నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి.
1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో.. మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు.
అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకొన్నారనే కారణంతో ప్రముఖులు అభద్రతా భావానికి లోనయ్యారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో రామారావు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు.
ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. అతను మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన కార్టూను ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది.
నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతీ సంవత్సరం మే 28న తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవంలా చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు వేడుకగా జరిగాయి.
భారత ప్రభుత్వం వారిచే విడుదల చేయబడిన స్టాంపు, ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఎన్.టి.ఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని 2023 ఆగస్టు 28 న విడుదల చేసింది. సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ లో, అతను సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు.
వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే. పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాల వల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు.
తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్దే. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను. ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన.
దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఎన్టీఆర్ పరిచయం చేసిన వారే. “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ ఎన్టీఆర్ సమర్థించటం ఒక విశేషం. సినీ నటుడుగా మదరాసులో ఆయన నివసించినపుడు తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చేవారు. మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం ఆయన పాలనలో ఒక సెన్సెషన్. రామారావు గారికి బాబాలు, మాతల పిచ్చి లేదు. దేవుని పట్ల భక్తి ఉంది. బుద్ధుని పట్ల అపార గౌరవమున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో, ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణంలాగ కనిపించారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు, బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు.
తెలంగాణాలో బడుగు, బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్, పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు, బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారారు ఎన్టీఆర్.
-బోళ్ళ సతీష్ బాబు.
మీడియా కో-ఆర్డినేటర్,
తెలుగుదేశం పార్టీ.
(స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.)