బిజెపి చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటారని భావించడం భ్రమలో జీవించడమే

-చంద్రబాబుకు అండగా నిలిచే నితిన్ గడ్కరిని తప్పించడం..
-జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకోవడం..
-ఆంధ్రాలో రామోజీ చిట్ ఫండ్ కేసు జగన్మోహన్ తో ఓపెన్ చేసి అమిత్ షా రామోజీరావు ను కలవడం..
-బీజేపీ టార్గెట్ టిడిపి, చంద్రబాబు …ఎవరు ఎక్కువుగా ఉహించుకోవడం అనవసరం..

ఇది చాలా వరకు నిజమే. మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ , కొంత మంది జర్నలిస్టులు కేవలం మైలేజ్ కోసం వారికి తోచిన వార్తలను జన బహుళ్యంలోకి చొప్పిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడును మళ్ళీ ఎన్డీఏలోకి చేర్చుకోవడంలో మోడీ మాట అటుంచి అమీషాకు సుతరమూ ఇష్టం లేదు. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో తమకు పోటీ వస్తారని కానీ, అడ్డు వస్తారని కానీ అనుమానం కలిగిన ప్రతి ఒక్క పార్టీని, నాయకుడిని మోడీ – షా ద్వయం ఉక్కుపాదంతో తొక్కి వేస్తోంది. ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏమిటంటే మోడీ- షా ద్వయం ఆధ్వర్యంలో ఎన్డీఏతో చేయి కలిపిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ లేదా నాయకుడు మట్టి కరిచిపోయారు. మరీ ముక్కుసూటిగా చెప్పాలంటే ఆ ద్వయం అలాంటి సీనియర్ నాయకులను అణచివేచారు.

ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో మోడీ-షా ఏమీ చేయడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో నేరుగా పొత్తులు పెట్టుకోవడం కూడా పార్టీకి నష్టం చేస్తుందని బిజెపి థింక్ ట్యాంక్ యోచిస్తోంది. కెసిఆర్ టిడిపి,బిజెపిల బంధాన్ని గత కాంగ్రెస్- టిడిపిల బంధంతో ముడిపెట్టి…. సెంటిమెంటు డ్రామాతో గట్టెక్కే యోచన లో ఉన్నారని బిజెపి వర్గాల భావన.

బీజేపీ అగ్రనేతలు హైదరాబాదు రాగానే కుటిల రాజకీయాలకు తెర లేపుతున్నారు. ఇటు రామోజీరావుపై మార్గదర్శి చిట్ ఫండ్ కేసును తిరిగి ఓపెన్ చేయించి, మళ్లీ ఆయనతోనే ఆయన స్వగృహంలోనేamith-ramojiమంతనాలకు అమిత్ షా తెర తీశారు. నయానా భయానా బెదిరించి రామోజీరావును, ఈనాడు పత్రికను బిజెపి వైపు మళ్లించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్ కేసును జగన్మోహసపురెడ్డితో రీ ఓపెన్ చేయించారు. ఒక చేత్తో కేసులు బనాయిస్తూ, మరో చేత్తో మాయమాటలు చెప్పడం- మంత్రంగాలు నడపడం గుజరాతీయులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం అమీషా చేస్తున్నదీ అదే. జూనియర్ ఎన్టీఆర్ ను దువ్వడం ద్వారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు పంపించడం మాత్రమే మోడీ-షాల మంత్రాంగం ఉద్దేశం.

రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో అయోమయం సృష్టించడమే రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లతో అమిత్ షా మంతనాల్లోని మర్మం. తాము ఏంntr-amith-shah చేయగలము ఎలా చేయగలమో చెప్పీ చెప్పకనే చెప్పడమే అమిత్ షా ఉద్దేశం. గత కొద్దిరోజులుగా యావత్ మీడియాలోనూ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ జరుగుతున్న చర్చలు, వెల్లువెత్తుతున్న భిన్నాభిప్రాయాలే అమిత్ షా మంత్రాంగం ఎంత బ్రహ్మాండంగా వర్కవుట్ అయిందో తెలియచెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బిజెపికి కేవలం 25-30 నియోజకవర్గాలకు మించి మరెక్కడా ఎన్నికల్లో గెలిచే బలంగాని, బలగం గానీ లేవు. అంటే అన్ని స్థానాలను గెలుస్తారని కాదు. ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ మాత్రమే కొంత అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంది. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఆ స్థానాన్ని కొద్ది నెలల్లో బిజెపికి కోల్పోవడం అనివార్యంగా కనిపిస్తోంది. మోడీ- అమిత్ షా తెరమీద కనిపించే బిజెపి మార్గదర్శకులు అయితే తెర వెనుక మరో ముగ్గురు వ్యూహకర్తలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై గత మూడు మాసాలుగా దృష్టి సారించారు. వారి ముగ్గురి మాటలే అమిత్ షాకు అసలు సిసలు గీటురాళ్లు. వారి వ్యూహాలను కాదని అమిత్ షా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.

ఇక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనతోనే కొన్ని అనూహ్య పరిణామాలు అతనికి అనుకూలంగా చోటు చేసుకున్న విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. న్యాయస్థానాలకు సంబంధించిన ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించడం సముచితం కాదు. ప్రస్తుతం 17 పైగా కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆయా కేసుల్లో కేవలం జరిమానాలతో తనను బయటపడవేయాలని బిజెపి అధినాయకత్వానికి పదేపదే మొరపెట్టుకుంటున్నారు. అతను కేసుల నుంచి పూర్తిగా బయటపడితే తమ చేయి దాటి పోతాడని బిజెపి అగ్రనాయకత్వానికి తెలియదనుకోవడం పొరపాటే.

babu-gadkariకానీ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే తెరవెనుక వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి బృందం రాటు తేలిపోయింది. కొద్ది రోజులు వెనక్కి వెళితే ఢిల్లీలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచే అతికొద్ది బిజెపి నాయకుల్లో అగ్రగణ్యుడైన నితిన్ గడ్గరీని మోడీ పార్లమెంటరీ పార్టీ బోర్డు, బిజెపి అభ్యర్థుల ఎంపిక కమిటీల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అది ఆర్ఎస్ఎస్ ప్రస్తుత నేత పూర్తి ఆమోదంతోనే చేశారంటే మోడీ- అమిత్ షా రాజకీయాలు ఎంతగా పదును తేలాయో గమనించవచ్చు. అలాంటి ద్వయం చంద్రబాబు నాయుడును నెత్తిన పెట్టుకుంటారని భావించడం భ్రమల్లో జీవించడమే అవుతుంది.

బిజెపికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన, లేదంటే గుర్తించదగిన ఒక్కటంటే ఒక్క మిత్రపక్షం కూడా లేకుండా పోయింది అనేది వాస్తవం. దానిని గుర్తించిన మీదటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన పడే గండిని పూడ్చుకోవాలంటే దక్షిణాదిలో తాము సొంతంగా కొన్ని లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీలో 5 నుంచి 8 లోక్ సభ స్థానాలు, తెలంగాణలో 8 నుంచి 10 లోక్ సభ స్థానాలపై గురి పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టినా తమ కోరిక నెరవేరే పరిస్థితి లేదని, జగన్ పార్టీతో పొత్తు సాధ్యం కాదని బిజెపి నేతలకు బాగా తెలుసు.

తెలంగాణలో స్థిరపడిన లేదా వలస వచ్చిన ఆంధ్రులు బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయరనే భయంతో బిజెపి సెటిలర్లను పలు పలు విధాలుగా దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే బిజెపి నాయకుల పర్యటనలు, ర్యాలీలు, ఆలయాల సందర్శనలు, నటీనటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులతో సమావేశాలను మీడియాలో హైలైట్ అయ్యేలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాల ముందు బిజెపి తెరవెనుక నడిపించే రాజకీయ ఎత్తుగడల ఆనవాళ్ల ఫలితాలు ప్రత్యర్థులకు చాలా ఆలస్యంగా గాని అర్థం కావు. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి అనుసరిస్తున్న కార్పెట్ బాంబింగ్ రాజకీయం ఇప్పుడిప్పుడే కేసీఆర్ కు పూర్తిగా అర్థమవుతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీని, మరోపక్క కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేసినందుకు ప్రస్తుతం కెసిఆర్ చింతిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడుతో బిజెపికి ఉపయుక్తంగా ఉంటుందంటే తప్ప అటు పొత్తులు కానీ, ఇటు అవగాహనతో కానీ ముందుకు పోయే అవకాశాలు లేనే లేవు. ప్రస్తుతం నలుగుతున్న రాజకీయమంతా ప్రత్యర్థులను అయోమయానికి గురి చేయడం మాత్రమే. అంతకుమించి మరేమీ లేదు. తెలుగుదేశం శ్రేణులు బిజెపి స్నేహ హస్తంపై ఆశలు పెంచుకోవాల్సిన అవసరం లేనేలేదు.

అవసరం తీరిన తరువాత అందరిని తొక్కేయడమే బిజెపి నైజం. బిజెపి దృష్టి అంతా ప్రస్తుతం తెలంగాణపై కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో బిజెపి ద్వయం నిర్ణయిస్తుంది. అప్పటిదాకా తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బిజెపి వ్యవహారాలను అతిగా ఊహించుకోవడం అనవసరం.

– వెంకటేశ్వర్లు కిలారు

Leave a Reply