పెదపాలపర్రును గుడివాడ డివిజన్, కృష్ణాజిల్లాలో కొనసాగించాలని గ్రామస్తుల వినతి

-సానుకూలంగా స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో పెదపాలపర్రు గ్రామాన్ని గుడివాడ రెవిన్యూ డివిజన్ పరిధి కృష్ణా జిల్లాలోనే కొనసాగించేలా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మాత్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం కైకలూరు నియోజవర్గం ముదినేపల్లి మండలంలో ఉన్న తమ గ్రామం జిల్లాల పునర్ విభజన వల్ల తీవ్రంగా ఇబ్బంది పడనుందని, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెవిన్యూ డివిజన్ కేంద్రం 70 కిలోమీటర్ల దూరానికి మారుతుందని గ్రామస్ధులు మంత్రికి విన్నవించారు. గ్రామ పెద్దలు కొరిపల్లి కృష్ణ ప్రసాద్, చళ్లగుళ్ల సుబ్రమణ్యేశ్వర వరప్రసాదు, బొప్పన ప్రసాద్, చళ్లగుళ్ల శ్రీకాంత్, కన్నెపోటు శ్రీనివాసరావు, చిలుకూరి ఫణి కుమార్ తదితరులు శుక్రవారం మంత్రి నివాసంలో కలిసి దాదాపు 1500 మంది గ్రామస్ధుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని ఏలూరు జిల్లాలో కలపటం వల్ల తాము అన్ని విభిన్న విధాలుగా నష్టపోతామని కొడాలి దృష్టికి తీసుకువచ్చారు. పాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి చేపట్టదలచిన జిల్లాల పునర్ విభజన అభినందనీయమని, కాని ప్రతిపాదిత జిల్లాలను యధాతధంగా ఆమోదిస్తే మా గ్రామం పరిపాలనా సౌలభ్య రహితంగా మారుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రెవిన్యూ డివిజన్ తమ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని, జిల్లా కేంద్రం మచిలీపట్నం కాగా ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉందని, కాని కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మా గ్రామాన్ని ఏలూరు జిల్లాగా ప్రతిపాదించటం వల్ల రెవిన్యూ డివిజన్ ముఖ్య కేంద్రం, జిల్లా కేంద్రం దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరుకు మారుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఫలితంగా రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం నిన్నటి వరకు 5 కిలోమీటర్ల దూరంలోని గుడివాడ వెళ్లిన తాము ఇకపై 70 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉందన్నారు.

కెడిసిసి బ్యాంకు మాజీ జిఎం కొరిపల్లి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామ అవసరాలు గుడివాడతోనే ముడిపడి ఉన్నాయని, రైతుల బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసు, రిజిస్టేషన్ కార్యాలయం గుడివాడకు కేటాయించబడి ఉండగా, గ్రామస్డుల వైద్య అవసరాలకు సైతం 5 కిలోమీటర్ల దూరంలో గుడివాడే కీలకమని మంత్రికి వివరించారు. తమ గ్రామాన్ని ఏలూరు జిల్లాలో కలపటం వల్ల వ్యవసాయ దారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, సరిహద్దులోని గుడివాడ రూరల్ మండలం మొటూరు, దొండపాడు, పాత చవటపల్లి , గుడ్లవల్లేరు మండలం చంద్రాల, విన్నకోట గ్రామాలలో సైతం తమకు వ్యవసాయ భూమలు ఉండగా, జిల్లా మార్పు ఫలితంగా ఆస్తులు ఒక జిల్లాలో నివాసం మరోక జిల్లాలో అవుతాయని పేర్కొన్నారు. చళ్లగుళ్ల సుబ్రమణ్యేశ్వర వరప్రసాదు మాట్లాడుతూ విద్యార్దుల పరంగా ఎదురయ్యే ఇబ్బంది మరింత భాధాకరమని ప్రతిపాదిత ఏలూరు జిల్లాలో గ్రామస్డులు నివాసం ఉంటుండగా, పిల్లలు గుడివాడలో విద్యాభ్యాసం చేస్తారని, వారి ధృవీకరణ పత్రాలలో కృష్ణా జిల్లాగా నమోదు అవుతుందని, తల్లి దండ్రులు ఏలూరు జిల్లాలో ఉండటం వల్ల పొట్ట చేతపట్టుకుని విభిన్న అవసరాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లినప్పుడు ఇది కూడా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. గ్రామస్ధుల విన్నపాన్ని సావధానంగా విన్న మంత్రి కొడాలి తప్పని సరిగా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేసారు.

Leave a Reply