– అయోధ్య ఆలయంలో నీరు నిలిచిపోయిందంటూ వచ్చిన వార్తపై నృపేంద్ర మిశ్రా క్లారిటీ
అయోధ్య: అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రామమందిరంలో నీరు నిలిచిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రాణప్రతిష్ట వేడుక నాటికి మొదటి అంతస్తు మాత్రమే పూర్తయి సిద్ధంగా ఉండగా, రెండవ, మూడవ అంతస్తులు నిర్మాణంలో ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వాస్తవాలు తెలియజేస్తూ కింద తెలిపిన ప్రకారం ఒక ప్రకటన విడుదల చేశారు.
“నేను అయోధ్యలోనే ఉన్నాను. మొదటి అంతస్తు నుంచి వాన నీరు వస్తుండటం కనిపించింది. ఇది ముందే ఊహించినదే, ఎందుకంటే… ప్రస్తుతం గురు మంటప్కి పై కప్పు వంటిది ఏమీ లేకుండా పూర్తిగా తెరవబడి బహిరంగమై ఉంది. రెండవ అంతస్తు, శిఖర నిర్మాణాలు పూర్తయితే ఇది మూసివేయబడుతుంది. మొదటి అంతస్తులో పనులు జరుగుతున్నందున కాలువమార్గంలో నీరు నిలిచి ఉండటాన్ని నేను గమనించాను.
ఈ పనులు పూర్తవగానే కాలువమార్గాన్ని మూసివేస్తారు. ఇక గర్భాలయంలో డ్రెయినేజి లేదు. ఎందుకంటే, మంటపాలన్నిటిలోనూ నీరు నిల్వ కాకుండా తగినంత వాలును కలిగి ఉన్నాయి. గర్భాలయంలోని నీరు కనిపిస్తే మానవశ్రమతో తొలగిస్తారు. అదీగాక, భక్తులెవరూ విగ్రహానికి అభిషేకాలు చెయ్యరు.
ఇక్కడ డిజైన్ లేదా నిర్మాణానికి సంబంధించిన సమస్యేమీ లేదు. బాహాటంగా తెరిచి ఉన్న ఆ మండపాలలోకి వాననీరు వచ్చే అవకాశముండగా, దీనిపై గతంలోనే చర్చ జరిగింది. అయితే, నగర వాస్తు ప్రమాణాల మేరకు వాటిని తెరిచి ఉంచాలనే నిర్ణయం జరిగింది.”