– బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తది
– హంతకులే సంతాపం తెలిపినట్టుగా కాంగ్రెస్, బీజేపీల తీరు
– బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ సాధన తరహా ఉద్యమం చేస్తాం
– రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల పెంపు
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
– బీసీల బంద్ కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు.. ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం
హైదరాబాద్ : ‘‘దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ పార్టీలు బంద్ కు మద్దతు తెలపడం అంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉంది.. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తది. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు కవిత మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులతో కలిసి శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో భారీ మానవహారం నిర్మించారు. గంటపాటు ఆందోళన చేసి బీసీలకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ లు పదే పదే మోసానికి పాల్పడుతున్నాయని అన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బీసీ బంద్ కు మద్దతు తెలపటం నవ్వులాటల ఉందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ల తీరు హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉందన్నారు.
నిజంగా బీసీ రిజర్వేషన్ల పై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మోడీ కాళ్లు పట్టుకొనైనా రిజర్వేషన్లు సాధించాలని డిమాండ్ చేశారు. 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందని కవిత అన్నారు. త్యాగాల ద్వారానే తెలంగాణ ఏర్పడిందని… అదే విధంగా బీజేపీ ఎంపీల పదవుల త్యాగాలతోనే బీసీ రిజర్వేషన్లకు తొలి అడుగు పడాలని అన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు నిర్లక్ష్యం వహిస్తే వారి ఇళ్లను దిగ్భంధిస్తామని హెచ్చరించారు.
అటు కాంగ్రెస్ పార్టీ కూడా స్వాంతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. జనగణన సహా అన్ని అంశాల్లో ఇక్కడి కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని కవిత అన్నారు.
ఒకసారి 42 శాతం రిజర్వేషన్లు అని మరోసారి సవరణ అని, మరోసారి జీవో అంటూ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో టెక్నికల్ గా సరైన వాదనలు వినిపించకపోవటంతోనే కోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయన్నారు. జీవో 9 విషయంలో కూడా ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవటంతోనే ఆ జీవోను కోర్టు కొట్టివేసిందన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని కవిత అన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలు రిజర్వేషన్ల కోసం పంతం పట్టారని చెప్పారు. వారి పంతం దేశంలోని బీసీలందరికీ మేలు జరిగేందుకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
ఆటోలతో ర్యాలీగా ఖైరతాబాద్ చౌరస్తాకు
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ లో పాల్గొనేందుకు శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇతర నాయకులు ఆటోలతో ర్యాలీగా బయల్దేరారు. ఖైరతాబాద్ చౌరస్తాలో గంటపాటు మానవహారం నిర్మించి బీసీల రిజర్వేషన్ల పెంపునకు మద్దతు ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు ఉద్యమాన్ని వీడేది లేదని కవిత తేల్చిచెప్పారు.
తల్లి వెంట.. బీసీలకు బాసటగా కవిత తనయుడు ఆదిత్య
బీసీ రిజర్వేషన్ల పెంపు బంద్ కు కల్వకుంట్ల కవిత తనయుడు ఆదిత్య మద్దతునిచ్చారు. తన తల్లి కవితతో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీల మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అవసరం ఉందన్నారు. ఈ మార్పును మన దగ్గరి నుంచే మొదలు పెట్టాలని అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎక్కువ మంది యువతకు అవకాశాలు వస్తాయని అన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. యువతే ఫ్యూచర్ అని.. బీసీల కోసం తన తల్లి చేస్తున్న ఉద్యమాలకు ప్రతి ఒక్కరు మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు.