మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత

అమరావతి: వైకాపా అరాచకాలపై ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నామని.. ఇకపై సహించబోమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎవరూ మిగిలేవారు కాదని వైకాపా నేతలను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షా స్థలి వద్ద సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పరిటాల రవిని చంపినవాళ్లు రోడ్లపై తిరుగుతున్నా గొడవ పెట్టుకోలేదు. చంద్రబాబుపై ఉన్న గౌరవం కారణంగా సహనంతో ఉన్నాం. ఇప్పుడు మా రక్తం ఉడుకుతోంది. తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఊ.. అంటే మంత్రులను తిరగనివ్వం. తిట్లు మాకూ వచ్చు.. మేమూ మాట్లాడగలం. మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం’’ అంటూ తీవ్రస్థాయిలో సునీత విరుచుకుపడ్డారు.

Leave a Reply