డిజిటల్ రూపీకి, పేటీఎంకు తేడా ఏంటి? ఏది బెటర్?

భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ ఎప్పుడు అందుబాటులోకి రానుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. దీంతో పాటు డిజిటల్ కరెన్సీ ఎలా ఉండనుంది? ప్రైవేటు డిజిటల్ వాలెట్లకు.. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? అన్న విషయాలపై వివరణ ఇచ్చాయి.

India digital currency: భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రైవేటు ఈ-వాలెట్లను పోలి ఉండే విధంగా డిజిటల్ కరెన్సీని రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి భౌతిక కరెన్సీ నోటుకు ప్రత్యేక నెంబర్ ఉన్నట్టుగానే.. డిజిటల్ కరెన్సీకి యూనిట్ల రూపంలో నెంబర్లు కేటాయించనుందని వెల్లడించాయి.
దేశంలో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అసలేంటీ ‘డిజిటల్ కరెన్సీ’?
 భౌతిక కరెన్సీకి ఎలక్ట్రానిక్ రూపమే డిజిటల్ కరెన్సీ. కంప్యూటర్లు, ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాల్లో నిక్షిప్తం చేసుకొని, ఉపయోగించే కరెన్సీనే డిజిటల్ కరెన్సీ అంటారు.

భారత్లో డిజిటల్ కరెన్సీ ఎలా?
భౌతిక నోట్లను ముద్రించే కేంద్ర రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుంది. ఇది భౌతిక కరెన్సీతో సమానం. ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లను సైతం డిజిటల్ రూపంలో జారీ చేస్తారు.

డిజిటల్ కరెన్సీతో ఏం చేసుకోవచ్చు?
భౌతిక కరెన్సీకి బదులుగా ఫోన్లోనే నగదు నిల్వ చేసుకోవచ్చు. ఆన్లైన్ చెల్లింపులన్నీ దీని ద్వారా చేసుకోవచ్చు. ప్రైవేటు కంపెనీ మొబైల్ వాలెట్లలో అందుబాటులో ఉన్నటువంటి.. అన్ని రకాల లావాదేవీలను ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ కరెన్సీ ద్వారా నిర్వహించుకోవచ్చు. అన్ని లావాదేవీలను ఒక్కచోటే చూసుకోవచ్చు.

how does digital currency work:
ప్రైవేట్ వాలెట్కు.. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి?
paytmప్రైవేటు కంపెనీల వాలెట్లు సైతం డిజిటల్ కరెన్సీ లాంటివే. మన బ్యాంకు ఖాతాలోని నగదును ప్రైవేటు వాలెట్లలోకి మళ్లించి.. చెల్లింపులు చేస్తూ ఉంటాం. అయితే, విశ్వసనీయతలో ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి, ప్రైవేటు సంస్థల సేవలకు తేడా ఉంది.ప్రైవేటు కంపెనీ ‘ఈ-వాలెట్’కు నగదు ట్రాన్స్ఫర్ చేస్తే.. ఆ సంస్థ విధించే ఛార్జీలను మనం భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆ కంపెనీ క్రెడిట్ రిస్కు.. మన నగదుకూ వర్తిస్తుంది. ప్రైవేటు కంపెనీలు అందించే వాలెట్ సర్వీసులో.. ముందుగా మనం చేసే పేమెంట్లు సంస్థకు వెళతాయి. ఆ లావాదేవీని మన తరఫున సంస్థ పూర్తి చేస్తుంది. మన తరఫున డబ్బును నిల్వ చేసి.. చెల్లింపులు చేస్తాయి.

కానీ, ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ.. రిజర్వు బ్యాంకు అధీనంలో ఉంటుంది. డిజిటల్ రూపీని రిజర్వు బ్యాంకే అభివృద్ధి చేస్తుంది కాబట్టి.. సాధారణ ప్రైవేటు సంస్థలు అందించే వాలెట్ సదుపాయాల కన్నా ఇది నమ్మకమైనది. వ్యాపారులకు చేసే చెల్లింపులన్నీ సెంట్రల్ బ్యాంకు నుంచే జరుగుతాయి. మధ్యలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ప్రమేయం ఉండదు.

కొత్త పేరు పెడతారా?
మార్కెట్లో వివిధ పేర్లతో క్రిప్టో కరెన్సీలు చలామణీ అవుతున్నాయి. అయితే అవి ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు. దానిపై ప్రభుత్వాలే కాదు.. మరే ఇతర వ్యక్తుల నియంత్రణ ఉండదు. కేంద్రం డిజిటల్ కరెన్సీనే ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దీన్ని.. ‘డిజిటల్ రూపీ’గా పిలిచే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఈ నగదును.. ‘సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ'(సీబీడీసీ)గా సంబోధించారు.

డిజిటల్ కరెన్సీ వల్ల లాభమేంటి?
 డిజిటల్ కరెన్సీ వల్ల నగదు నిర్వహణా భారం తగ్గుతుంది. డిజిటల్ కరెన్సీకి అయ్యే ఖర్చు.. భౌతిక కరెన్సీని ముద్రించడానికి అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువ. ఈ కరెన్సీ వల్ల దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సైతం ఊతం లభిస్తుందని కేంద్రం ఆశిస్తోంది.

ఇది క్రిప్టో కరెన్సీ లాంటిదేనా?
digital currency vs cryptocurrency:
కాదు. రెండూ డిజిటల్ రూపంలోనే ఉన్నప్పటికీ.. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ పూర్తిగా భిన్నం.క్రిప్టో కరెన్సీలు, ప్రైవేటు వర్చువల్ కరెన్సీలతో మన డిజిటల్|
cryptocurrency కరెన్సీకి పోలిక ఉండదు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ కానీ, క్రిప్టో కరెన్సీని గానీ జారీ చేసేవారు ఉండరు. కాబట్టి ఓ వ్యక్తికి చెందిన రుణంగా లేదా పూచీకత్తుగా వాటిని పరిగణించలేం. అందుకే ఆర్బీఐ ప్రైవేటు క్రిప్టో కరెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటి వల్ల జాతీయ భద్రతో పాటు, ఆర్థిక అస్థిరతకు ముప్పు ఉంటుందని చెబుతోంది.

మనం ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు?
వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి నాటికి డిజిటల్ రూపీ సిద్ధమవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి 2023 ఏప్రిల్ నాటికి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చు.

– వెలగపూడి గోపాలకృష్ణ

Leave a Reply