కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ప్రజల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్- జమ్మికుంట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వేలైన్ల కోసం ఎంతో శ్రమించానని గుర్తు చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో భాజపా నేతలు చెప్పాలని వినోద్ డిమాండ్ చేశారు. నియోజక వర్గ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేయాలని మిగతా విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.