-మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు
-నేను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం లేదు
-చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగండి
-చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోళ్లు
-విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్కు కేసీఆర్ లేఖ
-విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ తీరుపై అసంతృప్తి
-జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ
విద్యుత్ కొనుగోళ్లపై సీఎం రేవంత్రెడ్డి సర్కారు వేసిన జస్టిస్ నర్శింహారెడ్డి కమిషన్ తీరుపై మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిబంధనలకు అనుగుణంగానే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని స్పష్టం చేశారు. మా కృషి ఫలితంగానే తెలంగాలో నిరంతర విద్యుత్ సరఫరా అయిందని స్పష్టం చేశారు. ఇది చట్టవిరద్ధ కమిషన్ అని వ్యాఖ్యానించారు. అసలు నర్శింహారెడ్డిని కమిషన్ చైర్మన్ పదవికే రాజీనామా చేయాలని డిమాండ్ చే శారు. ఆమేరకు ైచె ర్మన్ జస్టిస్ నర్శింహారెడ్డికి కేసీఆర్ ఘాటు లేఖ సంధించారు. కేసీఆర్ లేఖ పూర్తి పాఠమిదీ..
జస్టిస్ నర్సింహారెడ్డి గారూ …
మీరు కమిషన్ నిబంధనల పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా..అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం. మాకు దురుద్దేశం ఆపాదించే విధంగా నిందలు వేశారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణి మీలో కనిపిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్గా మీరు ఉండడం సమంజసం కాదు.
జస్టిస్ నర్సింహారెడ్డి గారూ..మీరు కూడా తెలంగాణ బిడ్డే. 2014కు ముందు.. ఆ తర్వాత తెలంగాణలో కరెంట్ పరిస్థితి మీకు తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చినం. గత ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు.
అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినం. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. నిరంతర విద్యుత్ సరఫరా ఐటీ కంపెనీలను ఆకర్షించింది. ఐటీ కంపెనీలు హైదరాబాద్కు ఎలా క్యూ కట్టాయో చూశారు. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు కేవలం రూ.57 వేల కోట్లు. 2020 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు లక్షల కోట్లకు ఎలా పెరిగాయో మీకు తెలుసు.
ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయిక ప్రగతి ఎలా పెరిగిందో చూశారు. ఏటా లక్షలాది మోటార్లు కాలిపోవడం నివారించాం. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు మాయమయ్యాయి. హైదరాబాద్ తదితర నగరాల్లో డీజిల్తో నడిచే జెన్ సెట్లు మూలకుపడ్డాయి. తెలంగాణలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అనే నినాదం మారుమోగింది. రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.
నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే విచారణ కమిషన్
అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినం. విద్యుత్ ఘనతకు తక్కువ చేసి చూపించడానికి.. ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టం అనుకుంటే.. కమిషన్ చైర్మన్గా మీరు మాట్లాడిన తీరు బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత జూన్ 15 లోగా.. నా అభిప్రాయాలు మీకు సమర్పించాలనుకున్నా.
ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్దంగా.. విచారణ పూర్తికాక ముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరు ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను అడిగిన వ్యవధిని కూడా.. ఏదో దయ తలిచి ఇచ్చినట్లు మాట్లాడటం బాధ కలిగించింది. విచారణ పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి.
అన్ని కోణాల్లో పరిశీలించి, పూర్తి నిర్దారణకు వచ్చిన తర్వాత.. డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్తో బాధ్యులకు మాత్రమే ఇవ్వాల్సిన గురుతర బాధ్యత. కానీ, మీ వ్యవహార శైలి అట్లా లేదనడానికి చింతిస్తున్నాను. ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మీ వ్యాఖ్యలన్నీ ఒకవైపే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు.జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడమే మిగిలినట్టు మాట్లాడుతున్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ.. మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉంది. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టు మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ కమిషన్.. చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగండి.
తెలంగాణ ఏర్పడేనాటికి సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ రంగం.
ఏ ఒక్క రంగానికి సక్రమంగా విద్యుత్ సరఫరా అయ్యేది కాదు
ప్రతి యేటా లక్షలాది వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయేవి. రైతుల ఆత్మహత్యలు సర్వసాధారణంగా ఉండేవి. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి ఉండేది
పారిశ్రామిక రంగానికి ప్రతివారం కొన్ని రోజులు పవర్ హాలిడేలుండేవి. కరెంట్ కోసం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నా.
అపార్టుమెంట్లు, దుకాణాల్లో ఎక్కడ చూసినా డీజిల్ జనరేటర్ల రొద. రాష్ట్రమంతటా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు గ్రామాల్లో ఉ. 3 గంటలు, సా. 3 గంటలే త్రీ ఫేజ్ కరెంట్ ఉండేది. మండల కేంద్రాల్లో కూడా రోజుకు 8 గంటలు కరెంట్ కోతలుండేవి. మున్సిపాలిటీల్లో కూడా 6 గంటలు కరెంట్ కోతలుండేవి. రాజధాని హైదరాబాద్లో కూడా 4 గంటలు కరెంట్ కోతలుండేవి. రైతులు, కార్మికులు, సామాన్యులు.. ప్రతి ఒక్కరూ బాధితులే. అంత్యక్రియల సమయంలో స్నానానికి కూడా నీళ్లు లేని దుస్థితి.
అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ వాటా 53.89 శాతం అయినా.. 2,700 మెగావాట్ల కొరత ఉండేది. విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘించడం వల్ల 1,500 మెగావాట్ల లోటు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల 900 మెగావాట్ల లోటు. మొత్తం 5 వేల మెగావాట్ల విద్యుత్ లోటుతో తెలంగాణ ఉండేది.
తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు కఠోర శ్రమ చేశాయి. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా అభివృద్ధి చేశాం. విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించింది. 2014లో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. ఆ తర్వాత 20 వేల మెగావాట్లకు పెంచినం. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,196 యూనిట్లు పదేండ్లలో 2,349 యూనిట్లకు పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం.
తెలంగాణ విద్యుత్ విజయాలు ఆషామాషీగా రాలేదు. చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోళ్లు. చట్ట ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్మాణం.
దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్ సర్కార్ శ్వేతపత్రాలు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై.. ఎంక్వయిరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని మరిచారు.
అది చట్ట విరుద్దమని హైకోర్టు సీజేగా పనిచేసిన మీరు చెప్పలేదు.
చట్ట విరుద్ధమైన కమిషన్కు మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం విచారకరం. అనేక విషయాలను మీరు సమగ్రంగా పరిశీలించలేదు. ప్రెస్మీట్లో పలు అంశాలపై అసంబద్ధ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగండి.