– జగన్ భార్య భారతీరెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సలహా
– అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లు భ్రమిస్తున్నారు
– ఆయనను మానసిక వైద్యుడికి చూపించాలన్న వెంకన్న
– దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలి
విజయవాడ: ‘‘ జగన్ ను మానసిక వైద్యుడికి చూపించాల్సిందిగా ఆయన భార్య భారతిని కోరుతున్నా. ఐదేళ్లు నేరస్తులతో కలిసి పాలన చేసిన జగన్ కు, ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఓడిపోయి ఏడు నెలలు కూడా కాకముందే జగన్ అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నార ’’ ని మాజీ ఎమ్మెల్సీ , టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.
30 ఏళ్లు తానే సీఎం అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు కనీస గుర్తింపు కూడా జగన్ ఇవ్వలేదని, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కార్యకర్తల గురించి గంటల సేపు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్ప మరెవరూ సంతోషంగా లేరని చెప్పారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు.
జగన్ పాలనలో మహిళలను అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడారని, కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తున్నామని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి జగన్ అబద్ధాలు చెబుతున్నారని, జగన్ 2.0లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా ఉండవని ఎద్దేవా చేశారు.