– ప్రతిపక్ష నేత మీద చావు భాష ప్రయోగిస్తున్న ఏకైక సీఎం రేవంత్
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. రేవంత్ చావు భాష చూసి ప్రజలు
అసహ్యించుకుంటున్నారు. పాలమూరును వలసల పాలు చేసిందే దశాబ్దాల కాంగ్రెస్ పాలన. 19 నెలల కాంగ్రెస్ పాలనలో పాలమూరు నుండి తిరిగి వలసలు మొదలయ్యాయి.
2014 వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు అందింది 13 వేల ఎకరాలకు మాత్రమే కాంగ్రెస్ అంటే పెండింగ్ .. కేసీఆర్ అంటే రన్నింగ్ .. భీమా ,నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించింది కేసీఆర్. జూరాల చివరి ఆయకట్టుకు
సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కల్వకుర్తి ఎత్తిపోతల కింద దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది.
90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 19 నెలలుగా పడావు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తయిన టెండర్లను రద్దు చేసి వందల కోట్ల అదనపు భారం మోపుతున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.
పాలమూరు బిడ్డను చెప్పుకుంటున్న రేవంత్ గత 19 నెలలలో తట్టెడు మన్ను ఎత్తిన పాపాన పోలేదు. ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల మీద సమీక్ష చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తన మామ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నందుకయినా, దాని పనులు వేగవంతం అవుతాయి అని అనుకున్నాం. పేరు పెట్టి ఏడు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి లేదు.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి .. కాళ్లు తంగెళ్లు దాటడం లేదు.
రేవంత్ నాయకత్వంలో పాలమూరుకు మేలు జరగడం సంగతి తర్వాత .. కీడు చేయకుంటే అదే పదివేలు. మే నెలలో కృష్ణా నదికి వరద మొదలైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేయకుండా 45 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది.
నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి సగం చెరువులు, కుంటలు నిండేవి. కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. రాజకీయాల్లో హత్యలుండవ్ . ఆత్మహత్యలే ఉంటాయి. అభివృద్ధి చేసేందుకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని, రేవంత్ రెడ్డి తన చర్యలను వ్యతిరేకించిన వారి మీద పగ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడు.
రాజకీయాల్లో ఎందరో నియంతలు నేలకూలారు. వారి సరసన భవిష్యత్తులో రేవంత్ చేరడం ఖాయం. ప్రభుత్వ అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చి, ప్రతిపక్ష నేత మీద చావు భాష ప్రయోగిస్తున్న ఏకైక సీఎం రేవంత్.