– టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కుందాం
– భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు
– చంద్రబాబు పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా?
– పార్టీ పదవులను ఒక బాధ్యతగా భావించి చిత్తశుద్దితో పనిచేయాలి
– ఉత్సాహంగా పనిచేసే వారిని గుర్తించి పార్టీ కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలి
– వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) సమావేశం
– సమావేశానికి హాజరైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పూడి శ్రీహరి, పలువురు ఇతర నాయకులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా మీకు ఇచ్చిన పదవులు అంటే ఒక జవాబుదారీతనం, పరిధి ఉండాలని మన నాయకుడు జగన్ ఆలోచించి మీకు ఈ బాధ్యతలు అప్పగించారు. మీరు పార్టీ కేంద్ర కార్యాలయం, రీజనల్కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పరిశీలకులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసే సపోర్ట్ సిస్టమ్లో మీరు కీలకంగా ఉంటారు.
వైఎస్సార్సీపీలో లక్షలాది మంది క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, పార్టీని అభిమానించే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం. సమర్ధవంతంగా పనిచేసే వారిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించి ముందుకెళుతున్నాం. చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దానిని ధీటుగా ఎదుర్కుందాం.
మనం సంస్ధాగతంగా బలోపేతం అయినప్పుడే ఇవన్నీ ధీటుగా ఎదుర్కోగలుగుతాం. గ్రామాలు, వార్డులలో కమిటీల నియామకంపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టినప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. ప్రతి అనుబంధ విభాగం క్రియాశీలకంగా పనిచేయాలి, మీరంతా కీలక బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి తగిన విధంగా పనిచేయాల్సి ఉంది. నియోజకవర్గంకు పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు కళ్ళు చెవులులా పనిచేయాలి. ఇందుకు అవసరమైన యాప్ను కూడా సిద్దం చేశాం.
డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలు పూర్తిస్ధాయిలో చిత్తశుద్దిగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంపై మనం దృష్టిపెట్టడం వల్ల పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. కమ్యూనికేషన్ అనేది విస్తృతంగా పెరగడం వల్ల దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం.
స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉందాం. పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేసేవారికి కమిటీలలో తగిన ప్రాధాన్యతనిచ్చి వారి సేవలను వినియోగించుకుందాం, పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి.
నకిలీ మద్యంపై చంద్రబాబు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారు. సడెన్గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అతని వీడియో బయటికి వస్తుంది. జోగి రమేష్ పేరు చెబుతాడు. అతను చెప్పినందుకే చేశానంటాడు, వెంటనే ఈ రోజు కానీ రేపు అతని పేరు ఈ కేసులో చేర్చినా చేరుస్తారు. మీరంతా మీ గళాన్ని బలంగా వినిపించాలి. మనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి.