– రాజధాని లేని రాష్ట్రంగా మార్చేస్తున్నారు
– ఆ దోపిడీ నుంచి డైవర్ట్ చేయడానికే చట్టబద్ధత డ్రామా
– చంద్రబాబుకే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు
– దమ్ముంటే టెండర్లపై బహిరంగ చర్చకు రావాలి
– అమరావతి వర్కుల గురించి ఆర్టీఐలో అడిగితే వివరాలు ఎందుకివ్వలేదు?
– దేశంలో ఏ రాష్ట్రమైనా చ.అ. నిర్మాణానికి రూ. 14 వేలు ఖర్చు చేస్తోందా?
– రోజూ హైదరాబాద్ వెళ్లి వచ్చే పవన్, లోకేష్ లకు జగన్ ని ప్రశ్నించే హక్కు లేదు
– మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారు
– రాష్ట్రానికి గ్రోత్ సెంటర్గా వైయస్ జగన్ “మావిగన్”
– వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: సీఎం చంద్రబాబు విచ్చలవిడి దోపిడీ, అంతులేని అవినీతి, రాజకీయ కుట్రలతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని దెబ్బ తీస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పిస్తూ అమరావతిని దేశానికి అవినీతి రాజధానిగా మార్చేశాడని, ఆ దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే రాజధాని చట్టబద్ధత పేరుతో డైవర్షన్ డ్రామా నడిపాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ముసుగులో జరుగుతున్న అవినీతిపై వైయస్సార్సీపీ ప్రశ్నిస్తుందన్న భయంతోనే ప్రభుత్వం ఆ బిల్లును మండలిలో పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబుకి దమ్ముంటే రాజధాని నిర్మాణ టెండర్లపై బహిరంగ చర్చకు రావాలని, లేదా అఖిలపక్షాన్ని సమావేశపరిచి మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అమరావతి నిర్మాణంపై చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ది ఉంటే 12 ఏళ్లుగా ఈ ఏపీలో ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. రోజూ ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కి షటిల్ సర్వీసులు చేసే పవన్ కళ్యాణ్, లోకేష్లకు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇళ్లు కట్టుకుని భార్యతో కలిసి నివాసం ఉంటున్న వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హతే లేదని గట్టిగా బదులిచ్చారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తమ కుటుంబంతో ఎప్పుడు ఏపీకి వచ్చి నివాసం ఉంటారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్ ప్రతిపాదించిన “మావిగన్” రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని, తక్కువ ఖర్చుతో సత్వర అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మాణం చేయడంతోపాటు కేంద్రానికి పంపించడం చూస్తుంటే సీఎం చంద్రబాబుకి మతిభ్రమించిందా అనిపిస్తుంది. ఏ రాష్ట్రానికైనా రాజధాని విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఎప్పటినుంచో ఉన్న అమరావతి రాజధాని గురించి ఉన్నట్టుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరీ ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసెంబ్లీ తీర్మాణం చేసిన చంద్రబాబు, మండలిలో ఎందుకు చేయలేదు? మండలిలో అమరావతి రాజధాని గురించి చర్చ పెడితే రాజధాని ముసుగులో చేసిన చేస్తున్న అవినీతి బాగోతంపై సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయం పట్టుకుంది.
కేవలం డెవలప్మెంట్కే 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే భవన నిర్మాణాలకు, ఆ భవనాలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ఇంకెంత ఖర్చు చేయాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లెక్కచేయకుండా హద్దులు దాటి అప్పులు చేస్తూ అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను భ్రమల్లో ముంచేస్తున్నాడు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి దేశంలోని ప్రధాన నగరాల్లోనే చదరపు అడుగుకి రూ. 4500లతో 5 స్టార్ సౌకర్యాలతో అద్బుతమైన నిర్మాణాలు జరుగుతుంటే, అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ. 14వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అది కూడా ఇసుక ఫ్రీగా తీసుకుంటూ, ట్యాక్స్ మినహాయింపులు పొందుతూ కూడా. అమరావతిని దేవతల రాజధాని అంటూనే దేశంలోనే అవినీతికి కేపిటల్గా మార్చేశాడు. చంద్రబాబుకి దమ్ముంటే అమరావతి టెండర్లపై బహిరంగ చర్చకు రావాలి.
500 ఎకరాల్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ భవనాలతో కూడిన నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చు. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కట్టిన సెక్రటేరియట్ ను చూసైనా చంద్రబాబు కళ్లు తెరవడం లేదు. కేవలం రూ. 600 కోట్లతో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించారు. కానీ అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న సెక్రటేరియట్కి రూ. 4,354 కోట్లు అంచనా వేశారు. దీనికి ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వర్కులు, లిప్టుల ఏర్పాటుకు మరో రూ. 2316 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
మొత్తం ఒక్క సెక్రటేరియట్కే రూ. 6,671 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చవుతుంది. ఇది తెలంగాణ సెక్రటేరియట్కి చేసిన ఖర్చుకి పది రెట్లు. చదరపు గజం రూ.3 లక్షలతో భూమి కొనుగోలు చేసి అన్ని వసతులతో హైదరాబాద్లో రూ.10 వేలకు అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ అమరావతిలో మాత్రం భూములు, ఇసుక ఉచితంగా ఇచ్చి, ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చి రూ. 14 వేలు వ్యయం చేయడం చూస్తుంటే వేల కోట్ల అవినీతి జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
వైయస్ జగన్ సూచించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) రీజియన్లో రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు చెబుతున్న ఖర్చులో కేవలం 10 శాతంతో అద్భుతమైన నిర్మాణం పూర్తి చేయొచ్చు. రూ.30 నుంచి రూ. 40 వేల కోట్లు వెచ్చిస్తే అద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. రాజధానితోపాటు మెడికల్ కాలేజీలు, పోర్టులు, సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయొచ్చు. ఈ ప్రాంతం రాష్ట్రానికి ఒక గ్రోత్ సెంటర్గా డెవలప్ అవుతుంది.
అమరావతి పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు మింగడం తప్ప, రాజధాని పూర్తి చేయాలన్న చిత్తశుద్ది చంద్రబాబుకి లేదు. అధికారంలోకి రాకముందు నుంచే వైయస్ జగన్ తాడేపల్లిలో సొంతిల్లు కట్టుకుని భార్యతోపాటు నివాసం ఉంటున్నారు. కానీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబుకి ఇప్పటి వరకు సొంతిల్లు అనేది లేదు. లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ఇప్పటికీ హైదరాబాద్కి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. రాష్ట్రంలో గెస్ట్ హౌస్లలో ఉంటూ రోజూ గెస్ట్ లుగా హైదరాబాద్ నుంచి వచ్చిపోతున్న వీరంతా రాజధాని గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మీ భార్య పిల్లలతో ఇక్కడ కాపురం ఉండి అమరావతి గురించి మాట్లాడితే బాగుంటుంది.