Suryaa.co.in

Andhra Pradesh

జడ్జీల సంఖ్యను పెంచడానికి సీఎం జగన్ అంగీకరించలేదు

– రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర సీఎం జగన్ అంగీకరించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంచే ప్రతిపాదన లేదని రిజిజు స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు ఆర్టికల్‌ 124, 217, 224 ప్రకారం జరుగుతాయని, అందుకు కులం, తరగతి ప్రాతిపదికగా రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేశారు.

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఇప్పుడున్న 37కి మించి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఆయన రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ప్రతిపాదనలు అందాయని, అయితే అందుకు విముఖత చూపుతూ ఏప్రిల్‌ 29న ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాశారని చెప్పారు.రాష్ట్రప్రభుత్వ వైఖరితో జడ్జిల పెంపు ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదన్నారు.

హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంచే ప్రతిపాదన లేదని రిజిజు స్పష్టంచేశారు. ఏపీ హైకోర్టులో ఖాళీగా ఉన్న 6 జడ్జి పోస్టుల భర్తీకి కొలీజియం నుంచి కేంద్రానికి సిఫార్సులు అందినట్లు విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

హైకోర్టు కర్నూలుకు మార్చే ప్రతిపాదన పెండింగులో లేదు
ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలుకు మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక అభిప్రాయానికి రావాలని కిరణ్‌ రిజిజు తెలిపారు. తెదేపా రాజ్యసభ ఎంపీ, కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.తర్వాత కేంద్రానికి పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపాలన్నారు. కానీ ఇప్పటివరకూ కేంద్రం వద్ద అలాంటి పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ పెండింగులో లేదన్నారు. ఏపీ సీఎం మాత్రం ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలుకు తరలించడానికి 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు ఆర్టికల్‌ 124, 217, 224 ప్రకారం జరుగుతాయని, అందుకు కులం, తరగతి ప్రాతిపదికగా రిజర్వేషన్లు వర్తించవని కిరణ్‌ రిజిజు తెలిపారు.

LEAVE A RESPONSE