Suryaa.co.in

Telangana

పాదయాత్ర నా పూర్వ జన్మ సుకృతం

-పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటా
-గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం
-టీఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే నా ఆశయం
– రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో చరిత్ర స్రుష్టించి దేశవ్యాప్త చర్చకు తెరలేపుదాం
-యాత్ర సక్సెస్ కోసం దీక్ష పూనుకుందాం
-ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్

‘‘ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పాదయాత్ర చేయడం నా పూర్వ జన్మ సుక్రుతం. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన పార్టీ నాయకత్వానికి జీవితాంతం రుణపడి ఉంటా. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని జనం ఎలాంటి పాలన కోరుకుంటున్నారో అర్ధం చేసుకోవడంతోపాటు టీఆర్ఎస్ నియంత పాలనను అంతమొందించడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశం. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ను ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.

ఈనెల 14నుండి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ఈరోజు హైదరాబాద్ బర్కత్ పురాలోని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో జరిగిన పాదయాత్ర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, పాదయాత్ర సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, బొమ్మ జయశ్రీ, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, నాగూరావు నామోజీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, పోరెడ్డి కిశోర్, చందుపట్ల కీర్తిరెడ్డి, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, గుండగోని భరత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం. ఉదయం అంబేద్కర్ ఉత్సవాలు నిర్వహించిన తరువాత సాయంత్రం గద్వాల జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

అమ్మవారి ఆశీస్సులు, జాతీయ నాయకత్వం సహకారం, కార్యకర్తల అండతో తొలి విడత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్ని రాష్ట్రాలు తెలంగాణ తరహాలో పాదయాత్ర చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించడం మనందరికీ గర్వకారణం.

రెండో విడత పాదయాత్రతో చరిత్ర సృష్టించిన తో పాటు టీఆర్ఎస్ నియంత పాలనకు చరమ గీతం పాడాలి. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు తరలిరావాలని కోరుతున్నా.తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ తో అక్కసు పెంచుకున్న కేసీఆర్ బీజేపీపై తప్పుడు ప్రచారం చేసినా జనం నమ్మలేదు. హుజూరాబాద్ లో బీజేపీనే గెలిపించారు.

పాదయాత్ర చేయడం నా పూర్వ జన్మ సుక్రుతం. పార్టీకి, జాతీయ నాయకత్వానికి నేను రుణపడి ఉన్నా. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు ప్రజలు ఎలాంటి పాలన కావాలనుకుంటున్నరో పరిశీలించేందుకే పాదయాత్ర చేస్తున్నాం. టీఆర్ఎస్ నియంత పాలనలో జనం పడుతున్న బాధలను కళ్లారా చూసేందుకు యాత్ర చేస్తున్నాం.

గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యం. అందుకోసం వెనుకాడకుండా తెగించి కోట్లాడదాం. అందుకోసం అన్ని విధాలా సిద్ధమై పాదయాత్రకు తరలిరావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..

 

LEAVE A RESPONSE