– కనిగిరి నుంచి పారిశ్రామిక పార్కులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగనున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడు నుంచి ముఖ్యమంత్రి వీటికి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో రెండో దశ కింద 329 ఎకరాల్లో రూ.134 కోట్ల విలువైన 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించనున్నారు. వీటితో పాటు 587 ఎకరాల్లో అభివృద్ధి చేసేలా 32 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులు, 3 ప్రైవేటు ఎంఎంస్ఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతపురం, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, సత్యసాయి, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, అన్నమయ్య, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ పారిశ్రామిక పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 17 జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టనున్నారు.
900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టుబడులతో ఈ పారిశ్రామిక పార్కులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడులో 20 ఎకరాల్లో రూ.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎంస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానికంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పారిశ్రామిక పార్కుల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పాదనకు సిద్ధంగా ఉన్న 28 కంపెనీలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
రూ.25,696 కోట్ల విలువైన పెట్టుబడితో ఈ సంస్థలు పారిశ్రామిక పార్కుల్లో యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయల సీమలో 8 సంస్థల చొప్పున మొత్తం 28 సంస్థలు రేపు ప్రారంభం కానున్నాయి.