Suryaa.co.in

Telangana

కేసీఆర్ వడ్లను క్వింటాల్ కు రూ. 4250 అమ్ముకుండు

రైతుల వడ్లకు కనీసం రూ. 2000 కూడా ఇవ్వరా?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫామ్ హౌస్ లో 200 ఎకరాల్లో వరి పండించి.. కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండు.. కోటి 80 లక్షలు సంపాదించాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2 వేల చొప్పున కూడా కొనడం లేదు. కేసీఆర్ ఇదేనా రైతులపై నీకున్న ప్రేమ… ఇదేనా నువ్వు చెప్పే రైతు ప్రభుత్వం? అని ఆయన ప్రశ్నించారు. శనివారం బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురిలలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అన్నారు.

“తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మెడిగడ్డకు తీసుకెళ్లిండు..మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది..అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైన పేక మేడనా? ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది..మేడిగడ్డ అణా పైసకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ లను ఈ గడ్డ నుంచి తరిమికొట్టాలని.. వాళ్ల అరాచకాలు, దుర్మార్గాలను అంతం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. కాకా వెంకటస్వామి కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి అని.. నిరంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి అన్నారు రేవంత్ రెడ్డి.

వివేక్ వెంకటస్వామి వ్యాపారం చేసి కష్టపడి డబ్బులు సంపాదించారని , బాల్క సుమన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం మంచిర్యాల జిల్లాను నిర్లక్ష్యం చేసిందని చెప్పిన రేవంత్.. వివేక్, వినోద్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక్కడి కార్యకర్తలకు కాకా కుటుంబం అండగా ఉంటుందని.. కాకా కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

కాంగ్రెస్ విజయం ఖాయమైందని, ఆడబిడ్డల ఆశీర్వాదంతో.. రామగుండంలో కాంగ్రెస్ గెలవబోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణికి దేశంలో గొప్ప చరిత్ర ఉందని… సింగరేణి ఉత్పత్తే.. దేశం వెలుగులకు కారణని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందే కాంగ్రెస్ అని.. తెలంగాణ ప్రకటన ఆలస్యం అయితే.. ఢిల్లీలో ఒత్తిడి తెచ్చామని తెలిపారు.

సబ్బండవర్గాలను ఏకం చేసిందే కాంగ్రెస్ పార్టే అన్నారు. సింగరేణి కార్మికుల పోరాటమే.. తెలంగాణ రాష్ట్రమన్నారు. 60 ఏళ్ల ఏండ్ల కలను సాకారం చేసిందే కాంగ్రెస్ అన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరాయా?

ఓపెన్ కాస్ట్ మైనింగ్ మూసేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే ఒక బందిపోటు దొంగని రేవంత్ నిప్పులు చెరిగారు. సింగరేణి ఎన్నికల్లో గెలిచే సత్తా కేసీఆర్ కు లేదని.. అందుకే హైకోర్టుకెళ్లి వాయిదాలు తెచ్చుకున్నారని విమర్శించారు. కాకా చొరవతోనే సింగరేణి బతికిందని చెప్పారు రేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపు భర్తి చేయాలంటే కాంగ్రెస్ గెలవాలని… పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ 5.లక్షలు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరాలన్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలన్నా.. రూ.500లకే ఇంటికి సిలిండర్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి అన్నారు.

ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ధరణి కంటే మెరుగైన సాంకేతికతను కాంగ్రెస్ తీసుకొస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

 

LEAVE A RESPONSE