Suryaa.co.in

Telangana

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణం చేశారు.. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం కిషన్‌ రెడ్డి సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు.

ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు కాగా.. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, 1990లో బీజేపీలో చేరారు. ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.

త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.

LEAVE A RESPONSE