Suryaa.co.in

Telangana

బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసి చూపించగలరా?

– 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి?
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: బిజెపి నాయకులు మాట్లాడుతూ చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అంటే ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, కనీసం నికరాదాయంలో, గత పది సంవత్సరాలలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే, పెరగని వాళ్ళందరినీ బిజెపి టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా?

స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేసి, రైతులను ఆదుకోమని, రాజధాని వీధులకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఙప్తులు ఎప్పుడన్న పట్టించుకొన్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా? కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తలనుండి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా?

కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద రాయితీ ఇస్తుందని అని చెప్పడం తప్ప రైతాంగానికి ప్రత్యేకంగా చేసేందేమిటి అన్న దానికి సమాధానం చెప్పగలరా?

పామాయిల్ మీద దిగుమతి పన్ను తొలగించి, పామాయిల్ రైతుల నోట్లో మట్టి కొట్టింది కేంద్రప్రభుత్వ పెద్దలు కాదా? గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం అమలు చేయని వందల హామీలలో ‘భారత రైతులకు కనీసం మద్ధతు ధర విషయం ఇచ్చిన హామీ’ ఈ హామీ అమలు చేయక పోవడం వలన తెలంగాణ రాష్ట్ర రైతులే గత తొమ్మిదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.

2023-24 సంవత్సరానికి CACP అంచనా వేసిన క్వింటాలు ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు 1911 రూపాయలు కాగా, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటాలు మద్ధతు ధర 2876 రూపాయలుగా ప్రకటించాల్సిన కేంద్ర ప్రభుత్వం, గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించి తప్పుడు పద్ధతుల్లో లెక్కించి క్వింటాలు ధాన్యానికి ప్రకటించిన ధర కేవలం 2203 రూపాయలు మాత్రమే. ఫలితంగా రాష్ట్ర రైతులు ప్రతి క్వింటాలుకు 664 రూపాయలు నష్టపోయారు. దీనిపై కేంద్ర మంత్రివర్యులు మాట్లాడగలరా ?

కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని వారు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా, మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే, వారి అక్కసు ఈ విధంగా వ్యక్తం చేస్తూ మాట్లాడటం సరికాదని యావత్తు తెలంగాణ అభిప్రాయం.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము పంటలభీమా పథకంలో రైతువాటా కూడా కట్టడానికి సిద్ధపడుతుండగా, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వము అటువంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయం.

కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా కల్పించే బాధ్యత మాది
ఇప్పటికే సన్న వడ్లను రూ.500 బోనస్ ప్రకటించాం. పంటలకు అన్నిటికీ మద్ధతు ధరతో కొనే విధంగా ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. ఆర్థికవనరులు మితంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే రైతుకూలీలకు భరోసా, కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించి, అమలు ప్రయత్నాలు చేసే సందర్భములో కేంద్ర పెద్దలు పెద్దమనస్సులో సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం వారిని వారు దిగజార్చుకోవడమే.

రుణమాఫీ 2024 అమలుకు మా నాయకుడు రాహుల్ గాంధీగారు ప్రకటించిన తేదీ నుండి తీసుకొంటే రుణమాఫీ వర్తించే కుటుంబాలు తక్కువగా ఉండటం చేత, 12 డిసెంబర్2018 నుండి తీసుకొని, గత ప్రభుత్వము రుణమాఫీ చేయని కుటుంబాలకు కూడా వర్తింపచేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై గల ప్రేమను అర్ధం చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే రెండు విడుతలు కలిపి,లక్షన్నర లోపు రుణాలు ఉన్న 11,34,412 ఖాతాలకు 12,225 కోట్లు జమ చేయడం జరిగిందని ఇంకా లక్షన్నర పైన రుణాలను మాఫీ చేయవలసి ఉన్నదని రుణమాఫీ 2024 పథకం అమలులో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటు అర్హలైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకొంటున్నామని, దానిమీద ఏమైన సందేహాలు ఉంటె బీజేపీ పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, రైతాంగాన్ని గందరగోళంలో నెట్టొద్దని విజ్ఙప్తి చేశారు.

వ్యవసాయంలో కీలకమైన డీజిల్, పెట్రోల్ ధరలకు రైతులకు సబ్సిడీపై అందించాల్సిన విషయమై బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా పిఎంకిసాన్ కింద రైతులకు అందించే సహాయాన్ని పెంచాలని, అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ ఫిబ్రవరి 2019 నుండి కొత్త డేటా తీసుకొని మరింతమందికి అందేవిధంగా చూడాలని కోరారు.

LEAVE A RESPONSE