Suryaa.co.in

Telangana

మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా?

-ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు
-బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు?
-కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు…సిగ్గు
-అక్రమ నిర్భంధాలు…హౌస్ అరెస్ట్ ల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, గృహ నిర్బంధాలు చేయటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ నేతలను అర్థరాత్రి వరకు అక్రమ అరెస్ట్ లు చేసి, రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా ? అంటూ మండిపడ్డారు.

ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవటానికి కూడా అనుమతి లేదా? అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు.

తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతల్ని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE