Suryaa.co.in

Andhra Pradesh

2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్!

– గత ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపిన చెత్తపన్ను రద్దు
– పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, శుభకార్యం రోజున చెట్టు నాటండి
– మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులను గౌరవించాలి
– 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం..
– గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం
– గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం…
– ఆయన ఆశయాలకు అనుగుణంగా అంతా పనిచేద్దాం
– జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ
– ‘స్వచ్ఛతా హీ సేవా’లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన సీఎం

మచిలీపట్నం: ‘ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారి 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు సంకల్పం తీసుకోవాలి. ఒక ఆశయంగా పెట్టుకుని అందరూ ముందుకు రావాలి. పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ సేవకులు. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.. తక్కువ చేసి ఎవరూ మాట్లాడకూడదు. మనం ఆరోగ్యంగా ఉన్నామన్నా, శుభ్రమైన రోడ్లపై తిరుగుతున్నామన్నా దానికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వరద సమయంలో వారు బ్రహ్మాండంగా పనిచేశారు. మనం చేసే మంచి పనే ఎప్పుడూ శాశ్వతంగా గుర్తుంటుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం మచిలీపట్నంలో పర్యటించారు. విద్యార్థులతో కలిసి చెత్తను ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కూర్చుని స్వయంగా వారికి తేనీటిని అందించి కాసేపు ముచ్చటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

పింగళి వెంకయ్య పేరుతో మెడికల్ కాలేజీ నిర్మాణం
జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ దేశమంతా కదిలించారు…అహింసా పద్ధతిలో పోరాడారు. ఆయన సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం. గాంధీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామంటే అందుకు కారణం ప్రజాహితమైన ఆయన ఆలోచనలే. 1919లో గాంధీజీ మొదటిసారి కృష్ణా జిల్లాలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో పాల్గొన్నారు. 1921లో అఖిల భారత మహాసభల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ గడ్డపై పుట్టిన పుట్టిన పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీజీకి అందించారు. స్వాతంత్య్ర ఉద్యమం, పోరాటంలో పింగళి వెంకయ్య ముందుండి పోరాడారు.

ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే శక్తిని ఇచ్చిన పింగళి వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం. స్వాతంత్య్ర పోరాటానికి ఊతమిచ్చిన ప్రాంతమిది. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఎందరో మహానుభావులు విద్యనభ్యసించారు…కానీ కొందరు స్వార్థపరులు ఆ కాలేజీని కబ్జా చేయాలని చూశారు. మహనీయుల స్ఫూర్తిని కాపాడతాం. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వ ఆదీనంలో నిర్వహిస్తాం. పింగళి వెంకయ్య పేరుతో మెడికల్ కాలేజీ నిర్మిస్తాం అని సీఎం అన్నారు.

చెత్తపన్ను రద్దు చేస్తున్నాం…
సమైఖ్యరాష్ట్రంలో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించాం. ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నా మనసుకు దగ్గరగా ఉంటుంది. అందరం ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం. 2014, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు…ఇది అభినందనీయం. అక్టోబర్ 2న స్వచ్ఛ సేవకులకు అవార్డులు ఇచ్చి, వారిని అభినందించాలని గతంలో ప్రతిపాదించాం. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టాం. 2019కి ముందు పట్టణాల్లో డివైడర్లకు రంగులు వేసి, పార్కులు అభివృద్ధి చేశాం. కానీ 2019లో భూతం వచ్చి వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా కుప్పలుగా చెత్తను పెట్టారు. చెత్తతో సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

కంపోస్ట్ ఎవరువుల తయారు చేసి పంటలకు ఉపయోగించి ఎక్కడా చెత్త కనబడకుండా చేశాం. పట్టణాల్లో 2.43 లక్షల మరుగుదొడ్లు, 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి 110 మున్సిపాలిటీలను ఓడీఎఫ్ గా ప్రకటించాం. గత పాలకుల నిర్వాకం కారణంగా రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా ఉంది. 365 రోజుల్లో ఆ చెత్తంతా తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశిస్తున్నా. చెత్తపై పన్ను వేశారు తప్ప…చెత్త సరిగా తొలగించలేదు. చెత్తపై గత ప్రభుత్వం వేసిన పన్నును రద్దు చేస్తున్నాం. వచ్చే కేబినెట్ లో ఆమోదించి రద్దు చేస్తాం. నాడు గ్రామాల్లో 41.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించాం.

2018లో ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటించాం. 9,538 సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ కేంద్రాలను నిర్మించాం…కానీ వాటిని గత ప్రభుత్వం వినియోగించుకోకుండా రంగులు వేసుకుంది. విజయవాడ, గుంటూరులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. భవిష్యత్ లో ఎన్ని ప్లాంట్లు అవసరమవుతాయో ఏర్పాటు చేస్తాం. ప్రతి రోజూ విధిగా చెత్తను తొలగిస్తాం. టెక్నాలజీ ఉపయోగగించి భవిష్యత్తులో ఎక్కడా చెత్త లేకుండా చేస్తాం. పూడి పోయిన డ్రెయిన్లు డ్రోన్లతో గుర్తించి వదర సమయంలో క్లీన్ చేయించాం అని సీఎం తెలిపారు.

రాజకీయ నేరస్తుల ఆటకట్టిస్తా…
గత పాలకుల శాపంతో బుడమేరుకు గండ్లు పడి వరదలు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో విజయవాడ అతలాకుతలమైంది. లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సాధారణ స్థితికి తీసుకొచ్చాం. వారి సేవల వల్లే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు రాలేదు…ఇది మానవ సేవ అంటే. వరద బాధితులకు ఎవప్పుడూ లేని విధంగా ప్యాకేజీ ప్రకటించి ఇచ్చాం. ఒక్కో ఇంటికి రూ.25 వేలు అందించాను. మానవతా దృక్పథంతో ఆలోచించి సాయం అందించాం. పాడైపోయిన ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, మిగతా వాహనాలకు రూ.10 వేలు అందించాం.

బాధితులకు సాయం అందించేందుకు దాతలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. రూ.450 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలుగా అందించారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు రథం తగలబెట్టి నెపం మనపై వెయ్యాలని చూశారు. నేరం చేసిన రెండు నిమిషాల్లోనే పట్టుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద ఉంది. రాముడి విగ్రహ తల నరికితే నిందితులను పట్టుకోలేదు. దుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసిన వారిపై చర్యలు లేవు. అందుకే రాష్ట్రంలో మళ్లీ అవసరమైన చోటల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ఎదురు దాడి చేస్తారు. అందుకే నేరస్తుల ఆట కట్టిస్తాం… అని సీఎం హెచ్చరించారు.

నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని..
నా చిన్నతనంలో మా తల్లి వంటగదిలో పడిన కష్టాలు చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఆలోచించి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుండి 3 గ్యాస్ సిలిండర్లు యేటా ఉచితంగా ఇస్తాం. ప్రతి ఇంటికి గ్యాస్, విద్యుత్ అందిస్తాం. 2025 మార్చి నాటికి మరుగుదొడ్లు లేని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మిస్తాం. 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీళ్లిస్తాం.

జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం వినియోగించలేదు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నీరందే లక్ష్యంతో నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను కూర్చుని నిర్ణయించి…డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.

2029 నాటికి అవసరమైన చోటల్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరూ మీ పుట్టిన రోజు నాడు లేదా శుభకార్యం రోజున ఒక చెట్టు నాటండి. చెట్టు నాటడం మన నాగరికత. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తాం… అని ప్రకటించారు.

2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి
మచిలీపట్నం మంచి సిటీ…బ్రిటిష్ వారి సమయంలో ఓ వెలుగు వెలిగింది. 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోర్టు దుర్మార్గుల నిర్లక్ష్యంతో వెనక్కిపోయింది. బందరు పోర్టు పూర్తైతే ఇక్కడి వాసులకు అనేక లాభాలు కలుగుతాయి. బందరు నుండి రేపల్లెకు రైల్వే లైను ఏర్పాటుకు చొరవ తీసుకుంటాం. మచిలీపట్నంలో డ్రెయినేజీ 100 శాతం మంచిగా ఉండేలా చేస్తాం. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేస్తాం. డంపింగ్ యార్డు క్లీన్ చేస్తాం. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం. మచిలీపట్నం బీచ్ ను స్వదేశీ దర్శనం పథకం కింద అభివృద్ధి చేస్తాం. మత్య్సకారులకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తాం.

బందరు లడ్డు, రోల్డ్ గోల్డ్‌ నగల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. ఈ రెండింటి కోసం ఎమ్ఎస్ఎమ్ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. కళంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేస్తాం. ప్లెక్సీలను కంట్రోల్ చేయడానికి ఏపక్షంగా నిర్ణయం తీసుకోలేను… అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం. ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్ ను పెట్టుకుని విద్యుత్ తయారు చేయొచ్చు. వినియోగానికి పోను మిగిలిన విద్యుత్ ప్రభుత్వానికి విక్రయించవచ్చు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE