Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీకి జై కొట్టే నేతలపై అక్రమ కేసులు!

• పోలీస్ స్టేషన్ ల చుట్టు తిప్పుతూ వేధింపులు
• బయట పడుతున్న గత ప్రభుత్వ రీ సర్వే మోసాలు
• భూ కబ్జాలపై అధిక ఫిర్యాదులు
• సీఎంఆర్ఎఫ్, ఇతర అర్థిక సాయం కోసం వినతులు
• పలువురికి మాజీ మంత్రి ఆర్థిక సాయం

మంగళగిరి: తాము తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి అనుకూలంగా ఉన్నామని తమపై ఓ మహిళతో అక్రమ కేసులు పెట్టించి పోలీసు స్టేషన్ లకు తిప్పి వైసీపీ పాలనలో దారుణంగా కొట్టారని… కోర్టుకు వెళితే అక్రమ కేసులని తేలడంతో వాటిని కొట్టేశారని.. తాను ఒక సామాన్య రైతునని.. తనపై రౌడీషీట్ పెట్టి.. వారం వారం పోలీసు స్టేషన్ కు పిలిచి ఇబ్బంది పెడుతున్నారని. తనపై పెట్టిన అక్రమ రౌడీ షీట్ ను తొలగించి తనకు మానసిక వేదనను తొలగించాలని.. లేదంటే తనకు చావే శరణ్యమని.. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన పూజల కోటేశ్వరరావు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. పలువురు నేతలను కలిసి అర్జీని ఇచ్చి అభ్యర్థించారు. అర్జీ స్వీకరించిన మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అతనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. పలువురి అధికారులతో ఫోన్లలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

• సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం టీడీపీ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు అంచుల నరసింహరావు.. నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ మాజీ మంత్రి అంబటి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. పార్టీ కార్యక్రమాలను చేస్తున్నందుకు తన భార్య, కొడుకు తనపై అక్రమ కేసులు పెట్టారని.. దాంతో అమెరికా వెళ్లాల్సిన తన కొడుకు భవిష్యత్ ఆగిపోయిందని.. ఛార్జ్ షీట్ వేయని కేసులు తొలగించేందుకు సంతకాలు పెట్టకుండా పోలీసులు తిప్పుతున్నారని నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
• టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉండి పార్టీకోసం పనిచేసిన వారిని కాదని.. తమ సొంత మండలంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైసీపీ వారిని తన వర్గంగా ఏర్పాటు చేసుకుని టీడీపీ పార్టీని రెండు వర్గాలుగా చీల్చి అటు పార్టీకి ఇటు తమకు స్థానిక ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. కావలి నియోజకవర్గం దగదర్తి మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు గ్రీవెన్స్ లో నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను గమనించి పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
• గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే వలన తన భూమి 3 ఎకరాలు ఉండాల్సింది. 2.68 సెంట్లుగా చూపిస్తోందని అన్యాయంగా ఇతరుల పేరుమీదకు భూమిని ఎక్కించారని.. తనకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన లాకా జయప్రకాస్ గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• కడప జిల్లా కొండాపురం మండలం వెంకయ్య కాల్వ గ్రామంలోని హరిజనవాడలో ఉండే గుళ్లోళ్ల సాయి శ్రీ తండ్రి విజ్ఞప్తి చేస్తూ.. తన బిడ్డ బీటెక్ లో 830 కిపైనా మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందని.. కరోనా సమయంలో పడిన విద్యాదీవెన డబ్బులు తన భార్యకు ఆరోగ్య ఖర్చుల కోసం వాడుకోవడం వలన చదువు ముగిసినా కూతరు ఫీజు కట్టలేకపోయానని.. దాంతో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఉన్న తన కూతురు సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడంతో తన కూతురుకు వచ్చిన జాబ్ అవకాశం దూరం అయ్యిందని.. దయచేసి తన కూతురికి సర్టిఫికేట్లు ఇచ్చి న్యాయం చేయాలని నేతల ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే మాజీ మంత్రులు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ తో మాట్లాడి.. సమస్యను పరిష్కరించి విద్యార్థినికి సాయం చేయాలని కోరారు.
• తన పాపకు రెండు కిడ్నీలు పనిచేయడంలేదని.. కూలీ నాలి చేసుకుని బతికే తమకు పాప కిడ్నీ ఆపరేషన్ కు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టే స్తోమత లేదని.. గత ప్రభుత్వంలో పాప ఆరోగ్యం కోసం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని.. కిడ్నీ ఆపరేషన్ వెంటనే చేయకుంటే పాప ప్రాణాలకు ముప్పు ఉందని.. దాంతో పాప అమ్మమ్మ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారని.. ఆపరేషన్ కు సాయం చేసి ఆదుకోవాలని బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామానికి చెందిన శివబ్రహ్మేశ్వరి నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
• తన అన్నావదినలు ఇద్దరు కరోనా సమయంలో మృత్యువాత పడ్డారని.. వారికి మూగ చెవుడు కలిగిన 15 సంవత్సరాల పాప ఉందని.. తన అన్న వదినెల నుండి పాపకు రావాల్సిన భూమిని రమణారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారని.. పాపకు ఆ కొద్దిపాటి స్థలమే ఆస్తి అని ఆక్రమణదారుడి నుండి భూమిని విడిపించి పాపకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం జెజె పేట గ్రామానికి చెందిన పీలం రవీంద్ర వేడుకున్నారు.
• ప్రభుత్వ పాఠశాలల్లో నియమించబోవు కంప్యూటర్ ఆపరేటర్స్, కంప్యూటర్ టీచర్స్ కు గతంలో పనిచేసిన కంప్యూటర్ ఉపాధ్యాయులైన తమకు వయస్సుతో సంబంధం లేకుండా విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కంప్యూటర్ టీచర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంటి శేఖర్ తదితరులు నేతలకు అభ్యర్థించారు.
• విద్యుత్ సర్కిల్ ఆఫీసు గుంటూరులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి విడతలవారీగా తన దగ్గర నుండి రూ. 6,50,000 ల నగదు తీసుకుని తనను మంద కిషోర్ అనే వ్యక్తి మోసం చేశారని.. తనపై చ్యలు తీసుకుని డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
• ఇసుక కొరత, నిర్మాణ వ్యయం, పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు పడుతున్న సమయంలో టీడీఆర్ బాండ్లు పూర్వం కొన్నవారికి న్యాయం చేసి.. నిర్మాణ అనుమతులను సలుభతరం చేసి నిర్మాణ రంగం ఊపందుకునేలా చూడాలని సివిల్ ఇంజనీర్ ఆదర్స్ గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• గత ప్రభుత్వం రీ సర్వే పేరిటన 8.11 సెంట్లు ఉండాల్సిన భూమిని 7.70 సెంట్లుగా మార్చి పాస్ పుస్తకాలు తీసుకోమంటున్నారని.. దానికి తాము అంగీకరించలేదని.. దయ చేసి 8.11 సెంట్లుగా చూపించి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని విజయవాడకు చెందిన డాక్టర్ సాయి ప్రమోద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
• ఇంటి నిర్మాణం పూర్తి చేసి స్వాధీనం చేస్తామని నమ్మించి తన వద్ద నుండి రూ. 45 లక్షలు తీసుకుని ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పూర్తి చేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారని.. ఆఫీసుకు వెళ్లి అడిగితే కుంటి సాకులు చెబుతున్నారని, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీకి చెందిన అడుసుమిల్లి గోపాల కృష్ణకుమార్ అనే వ్యక్తి విజయవాడకు చెందిన మాచినేని కోటేశ్వరరావుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• ధర్మవరానికి చెందిన రంగం ఆంజనేయులు విజ్ఞప్తి చేస్తూ.. చేనేత మగ్గాలు నేస్తూ.. వర్తక వ్యాపారం చేస్తున్న తన నుండి విజయవాడ కృష్ణలంకలో ఉండే కె.సీత, ఆమె కొడుకు నరేంద్రలు రూ. 24,70,000 ల విలువైన పట్టు చీరలు తీసుకుని నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రీవెన్స్ లో బాధితులు నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నగదు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
• రికార్డులు తారుమారు చేసి వైసీపీ నేతలు మద్దాల సుబ్బారావు, అతని కుమారుడు నాగేశ్వరరావుల అనుచరులు పొలాన్ని కబ్జా చేసి పొలంలోకి వెళ్లనివ్వడంలేదని.. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని.. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కు చెందిన మాదాల పెంచలయ్య విజ్ఞప్తి చేశారు.

పింఛన్ లు, సీఎంఆర్ఎఫ్ సాయం, ఆర్థిక సాయం, వరద బాధిత సాయంతో పాటు పలువురు వివిధ సమస్యలపై గ్రీవెన్స్ లో నేతలను కలిసి అర్జీలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE