Suryaa.co.in

Telangana

పేదల పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా?

-పేదలకు విద్యను చేరువ చేసేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

షాద్ నగర్: రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని మేం భావిస్తున్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్య, నిరుపేదలకు వైద్యం అందిస్తామని మాట ఇచ్చాం. గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది.

పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మా నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని మేం భావించాం. అందుకే టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించాం. 22 లక్షల కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసిన కేసీఆర్.. 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతులకు 10వేల కోట్లు ఖర్చు చేయలేదు.

పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ 5వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు.పేదలకు విద్యను చేరువ చేసేందుకే మేం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.1972 పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారు. పీవీ దార్శనీక ఆలోచనతో బుర్రా వెంకటేశం లాంటివారు ఐఏఎస్ స్థాయికి ఎదిగారు.

గత ప్రభుత్వం పేదలకు విద్యను అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టలేదు. కానీ మేం చేస్తుంటే తప్పుపడుతున్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు?

ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే విమర్శిస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా? మేం అధికారంలోకి రాగానే 90రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. నిన్న 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించాం.

కుల మతాల మధ్య వైషమ్యాలు తొలగొంచడం మా విధానం. కానీ వాళ్ల కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలనేది కేసీఆర్ విధానం. ఏం? మీ పిల్లలు రాజ్యాలు ఏలాలి కానీ… పేదల పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించినన పార్టీ కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ కు గుండు సున్నా ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదు. వాళ్లకు జ్ఞానోదయం కాకపోయినా ఫరవాలేదు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో ని 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ లో కేసీఆర్ పాలనలో కనీస మౌలిక వసతులు కల్పించలేదు. 33 జిల్లాలో ప్రభుత్వ స్థలాన్ని దిగమింగి కేసీఆర్ పార్టీ భవనాలు కట్టుకుండు.

పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి, పైసలు ఉన్నయ్ కానీ.. పిల్లలకు బడికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరుగా ఉంటే వారి మనసుల్లో విషం నిండుతుంది. అందుకే కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.

LEAVE A RESPONSE