* రాజధాని పేరుతో భూ దోపిడీ చేస్తే ఊరుకోం
– ఆ 33 వేల ఎకరాలకు పారదర్శకత ఏది?
* అమరావతిలో అవినీతిపై ఆధారాలతో త్వరలోనే నివేదిక
* అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రజల కోరిక
* రైతులకు అన్యాయం జరిగితే బీసీవై పార్టీ ఉద్యమం
* పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్పష్టీకరణ
అమరావతి: రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుండి బలవంతంగా భూ సమీకరణ చేస్తే బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.. అమరావతి నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని.., కానీ బలవంతపు భూ సమీకరణకు మాత్రమే వ్యతిరేకం అని ఆయన పేర్కొన్నారు.
“రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ ఎంతవరకైనా పోరాడుతుంది. బలవంతంగా వారి నుండి భూములను సమీకరిస్తే మాత్రం పార్టీ న్యాయం వైపు నిలబడుతుంది.. రాజధాని నిర్మాణం అనేది ఆరు కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోరిక, ఎమోషన్, సెంటిమెంట్, అవసరం. వీటిని ఆసరాగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఎవరైనా భూ దోపిడీకి పాల్పడితే ఊరుకునేది లేదు.
ఇప్పటికే అమరావతిలో జరుగుతున్న భూ కుంభకోణాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.. వాటిపై త్వరలోనే నిజాలు బయట పెడతాం. మొదటి విడత రైతులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతనే రెండో విడత సమీకరణ చేయాలి” అని ఆర్సీవై ప్రకటన విడుదల చేశారు.
మొదటి విడతలో 29 వేల రైతుల నుండి సుమారుగా 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. దాదాపు పదేళ్లు కావస్తుంది.. మధ్యలో ఐదేళ్లు ఓ దుర్మార్గ పాలన కారణంగా ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రాష్ట్రంతో సహా, ఆ రైతులు కూడా దారుణంగా నష్టపోయారు. దాన్ని కప్పి పుచ్చే క్రమంలో పూర్తి జవాబుదారీ, పారదర్శకంగా వ్యవహరించాల్సిన కూటమి ప్రభుత్వం వాటికి లెక్కలు చెప్పకుండా మరో విడత 35 వేల ఎకరాలను సమీకరణకు సిద్ధం అవుతుండడం అనుమానాలకు తావిస్తోంది.
దీనిలో టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి పెద్దల బినామీల ద్వారా లావా దేవీలు నడుపుతున్నారన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. రైతుల ముసుగులో, రాజధాని ముసుగులో దేశంలోనే అతి పెద్ద భూ మాఫియా ఇక్కడ జరుగుతున్నట్టు రైతుల నుండి సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే కూటమి భవిష్యత్తు జగన్ పార్టీ కంటే అధః పాతాళానికి వెళ్తుంది. బీసీవై పార్టీ అంతర్గత విచారణ ద్వారా నిజాలు నిర్ధారించుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తాం. రైతుల నుండి భూ సమీకరణకు ప్రయత్నిస్తే మాత్రం పార్టీ వారికి పూర్తిగా అండగా ఉంటుందని రామచంద్ర యాదవ్ ప్రకటనలో తెలిపారు.