– గత టీడీపీ హయాంలో భారీ లిక్కర్ స్కాం
– నేడు కూటమి సర్కార్ లోనూ దానికి మించి మద్యం అవినీతి
– రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు
– వైయస్ జగన్ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి, ఆదాయం పెరిగింది
– చంద్రబాబు హయాంలో మద్యం విక్రయాలు పెరిగి, ఆదాయం తగ్గింది
– బాబు అవినీతికి ఇంతకన్నా నిదర్శనం కావాలా?
– రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరార్శించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తదితరులు
రాజమహేంద్రవరం: ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాంకు తెరతీసిందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాజమహేంద్రవరం మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్ లతో కలిసి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి పరామర్శించారు.
అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చి, నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైళ్ళకు పంపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు.
నేడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్నది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. ఏపీలో వైయస్ఆర్సీపీ హయంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను తీసేసి, ప్రభుత్వమే వాటిని నిర్వహించింది.
వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం వైయస్ జగన్ ఏ డిస్టిలరీలకు తన పాలనలో కొత్తగా అనుమతులు ఇవ్వలేదు. ఏ డిస్టిలరీకి ప్రత్యేకమైన ప్రేమను చూపడం, అధిక ఆర్డర్లు ఇవ్వడం వంటివి చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన అనుమతులను పొందిన డిస్టిలరీలే వైయస్ఆర్సీపీ హయాంలోనూ మద్యంను సరఫరా చేశాయి. ఈ ఆర్డర్లు, విక్రయాలు చాలా పారదర్శకంగా జరిగాయి.
కానీ నేడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లిక్కర్ దుకాణాలను తీసేసి, ప్రైవేటు వారికి అప్పగించారు. అలాగే మద్యం రేట్లు ఎమ్మార్పీని ఉల్లంఘంచి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. నేడు మద్యం డోర్ డెలివరీ అవుతోంది. ప్రతి గ్రామం, వార్డుల్లో మద్యం బెల్ట్ షాప్లు నడుస్తున్నాయి. దీనికి తోడు కల్తీ మద్యంను కూడా విచ్చలవిడిగా తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఇంత చేసినా ఆదాయం మాత్రం పెరగడం లేదంటే అర్థం ఏమిటీ.? 2014-19 చంద్రబాబు పాలనలో ఆఖరి సంవత్సరంలో వచ్చిన ఏడాది మద్యం ఆదాయం కేవలం రూ.17వేల కోట్లు మాత్రమే. తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సీపీ హయాంలో ఆఖరి ఏడాది వచ్చిన మద్యం ఆదాయం రూ.25 వేల కోట్లు. పైగా మద్యం విక్రయాలు కూడా గణనీయగా తగ్గాయి. ఇంతగా మద్యంను నియంత్రించేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్ళీ మద్యంను అడ్డం పెట్టుకుని తన అవినీతి దాహంను తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడు.
తప్పుడు కేసులకు భయపడేదే లేదు
ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైయస్ఆర్సీపీ శ్రేణులను, నాయకులను తప్పుడు కేసులతో వేధించాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది. ఏపీలో తాలిబన్ పాలనను తలపిస్తోంది. ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని సీఎంగా ఉన్న చంద్రబాబు విస్మరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు వైయస్ఆర్సీపీ భయపడేది లేదు. ప్రజాప్రతినిధులకు చట్టప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలను కల్పించాల్సిన అవసరం లేదా?
ఒక తీవ్రవాదులను చూసినట్లుగా వారిని చూడటం దారుణం. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఈ రోజు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లోని పాలకులకు అలవాటుగా మారే ప్రమాదం కూడా ఉంది. న్యాయపరంగా ఎంపీగా ఉన్న వ్యక్తికి జైలులో కల్పించాల్సిన కనీస సదుపాయాలను కూడా ఇవ్వకుండా వేధించాలనుకోవడం దారుణం. దీనిని బట్టే ఎంపీ మిథున్ రెడ్డిపై ఈ ప్రభుత్వానికి ఉన్న కక్ష ఏమిటో అర్థమవుతోంది. చట్టపరంగా ఇవ్వాల్సిన సదుపాయాలు కల్పించకపోతే న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమ కేసులు
– మాజీ హొంమంత్రి తానేటి వనిత
ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమంగా లిక్కర్ స్కాం కేసులను బనాయించి, జైలుకు పంపారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపించి అక్రమాలకు పూర్తిగా నిర్మూలించాం. బెల్ట్ షాప్లను రద్దు చేశాం, ముప్పై శాతం వరకు మద్యం విక్రయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. మద్యం ధరలను కూడా పెంచాం. మద్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నాం. ఇటువంటి మంచి పాలసీని తీసుకువస్తే, దానిపైన కూడా బురదచల్లడం దుర్మార్గం.
కూటమి కుట్రలను ప్రజల్లోకి తీసుకువెడతాం
– మాజీ ఎంపీ మార్గాని భరత్
వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్లకు భయపడరు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కుట్రలను ప్రజల్లోకి తీసుకువెడతాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు మూడువేల కోట్ల రూపాయలు ప్రివిలైజ్ ఫీజ్ను తగ్గించి అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు. దానిపై సీఐడీ కేసులు కూడా నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తు కూడా జరుగుతోంది. వైయస్ జగన్ ప్రభుత్వంలో పారదర్శక విధానాన్ని తీసుకురావడం ద్వారా మద్యంను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది.
అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏడాదికి రూ.16వేల కోట్ల మేరకు మాత్రమే మద్యం ద్వారా ఆదాయం వస్తే, వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏడాదికి రూ.25 వేల కోట్ల ఆదాయం పెరిగింది. అలాగే మద్యం విక్రయాలు తగ్గాయి. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో సర్కార్కు జమ కావాల్సిన ఆదాయం చంద్రబాబు, ఆయన బినామీల జేబుల్లోకి వెళ్ళడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఈ అవినీతిని నిర్మూలించడం వల్లే వైఎస్ జగన్ ప్రభుత్వంలో మొత్తం సొమ్ము సర్కార్ ఖజానాకు జమ అయ్యింది. అయినా కూడా చంద్రబాబు సిగ్గు లేకుండా లిక్కర్ స్కాం అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి, పాలనకు నిదర్శనం. రూ.370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా అన్ని ఆధారాలతో దొరికిపోయారు. తన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే లిక్కర్ స్కాం అంటూ ఎంపీ మిథున్ రెడ్డి వంటి నేతలను అరెస్ట్ చేసి కుట్రలకు పాల్పడుతున్నారు.