– ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే తప్పుల తడక
– 52 శాతమున్న బీసీల జనాభా 46 శాతానికి ఎలా తగ్గింది ?
– తక్షణమే కుల సర్వే వివరాలు బయటపెట్టండి
– దమ్ముంటే గ్రామ పంచాయతీల వారీగా కుల సర్వే వివరాలను బహీర్గతం చేయాలి
– రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే తప్పుల తడకగా ఉందని, దాన్ని కాంగ్రెస్ పార్టీ సమాజపు ఎక్స్ రే గా అభివర్ణించడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. “అది ఎక్స్ రే కాదు…. కనీసం సీటీ స్కాన్ కూడా కాదు” అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న రేర్ డేటా నిజమైతే తక్షణమే దాన్ని బయటపెట్టాలని, గ్రామ పంచాయతీల వారీగా, కులాల వారీగా కుల సర్వే వివరాలను బహీర్గతం చేయాలని రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాలు విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కుల సర్వే పారదర్శకంగా జరగలేదని, అందులో ఎన్నో లోపాలున్నాయని ఎండగట్టారు. 2014లో 52 శాతమున్న బీసీల జనాభా 2024కు వచ్చే సరికి 46 శాతానికి ఎలా తగ్గిందని ప్రశ్నించారు. దీన్ని బట్టే ప్రభుత్వం చేసిన కుల సర్వేకు విలువ లేదని తేలిపోయిందని స్పష్టం చేశారు. కాబట్టి గ్రామాల వారీగా వివరాలు బయటపెడితే దూద్ కా దూద్.. పానీ కా పానీ తేలిపోతుందని తెలిపారు.
యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీన మేషాలు లెక్కించడమేమిటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. యూరియా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని దేబిరించడం కాదని, రాష్ట్రానికి రావాల్సిన కోటాను కొట్లాడి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం ఎందుకు? వానాకాలం పంట సీజన్ ఆరంభం నుంచే రైతులు అవస్థలు పడుతున్నా పట్టింపేది ?” అని ప్రశ్నించారు. పంట సీజన్ మొదలైన నెలన్నర తర్వాత వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సీఎం దేశంలో రేవంత్ రెడ్డి ఒక్కరేనేమో అని విమర్శించారు. అయినా కూడా రైతుల కష్టాలు తీరలేదని, నిత్యం యూరియా కోసం ఆగచాట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నిర్లప్తత తోడు కావడంతో మన రైతులు పొలం పనులు వదిలేసి యూరియా కోసం పరుగులు తీస్తున్నారని తెలిపారు.