– మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్: 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీలకు అనేక హామీలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అదే సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున ప్రకటనలు చేశారు. కానీ బీసీలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ కపట నాటకం ఆడుతోందని, దానికి వ్యతిరేకంగా, బీసీల హక్కుల కోసం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. బీసీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా కుట్ర చేస్తున్నారు. బీసీ సంక్షేమానికి ఏడాది రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని పూర్తిగా మరిచిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీజేపీ ఆ బిల్లుకు భేషరతుగా మద్దతు తెలిపింది. ఆ తర్వాత ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. అయితే, దాదాపు ఐదారు నెలలు గడిచినా ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు.
హైకోర్టు మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ చివాట్లు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 243డి(6) క్లాజ్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తోంది. 42% బీసీ డిక్లరేషన్ అనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డిక్లరేషన్ను విడుదల చేశారు. ఇప్పుడు ఆ బిల్లును అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ కేంద్రంపై నెపం మోపడం ఏమిటి? దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే… అందులో కేవలం 32 శాతం మాత్రమే బీసీలకు ఇవ్వాలనుకుంటున్నారు. మిగతా 10 శాతం మాత్రం ఎంఐఎం చెప్పినట్టు, ఓవైసీ సోదరుల ఒత్తిడితో ముస్లింలకు కేటాయించాలని చూస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ పేరిట తేవడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది.
బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే… 42% రిజర్వేషన్లలోని ముస్లింలకు కేటాయించిన 10% రిజర్వేషన్లను ఎత్తివేయాలి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేసిన పార్టీ బిజెపి. బీసీ కమిషన్ను తీసుకొచ్చి, దానికి రాజ్యాంగబద్ధత కల్పించినది కూడా బీజేపీయే. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఐదుగురు ముఖ్యమంత్రులు బీసీలు. 1947 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, తెలంగాణలో గానీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయని పార్టీ కాంగ్రెస్.
రాష్ట్రంలోని తొమ్మిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. అందుకో కేవలం ఒక్కరే బీసీ కావడం కాంగ్రెస్ వైఖరిని చూపిస్తోంది. కాంగ్రెస్ కేబినెట్లో కేవలం ముగ్గురు బీసీ మంత్రులే ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 బీసీ డివిజన్లలో 35 డివిజన్లు మజ్లిస్కు కేటాయించారు. దీనివల్ల బీసీల హక్కులను కాలరాశారు. ఇప్పుడు బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
బీఆర్ఎస్ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కానీ ఎంబీసీల సంక్షేమం కోసం తగిన విధంగా పనిచేయలేదు. సంచార జాతుల సహా అనేక బీసీ కులాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. బీసీలకు పెద్దపీట వేస్తున్న బీజేపీకి బీసీ సమాజం అండగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీలను భారతీయ జనతా పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 42% బీసీ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలి. దానికి బీజేపీ మద్దతు తెలుపుతుంది. కానీ అందులో 10% ముస్లింలకు రిజర్వేషన్లు కేటాయించడం సరికాదు.
దత్తాత్రేయని గరవర్నర్ గా, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ని రాజ్యసభ సీటు కేటాయించింది. అనేకమంది బీసీలకు ఇతర పదవులు, హోదా కల్పించింది బీజేపీ మాత్రమే. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పదవులు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అందువల్ల బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ మహాధర్నాకు వచ్చిన బీసీలను చూసైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరువాలి. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లినా… అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అపాయింట్మెంట్ దొరకడంలేదు. అందుకే జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల ధర్నా పేరుతో నాటకమాడుతున్నారు.
బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. అత్యధికంగా బీసీ ఎంపీలు, మంత్రులు బిజెపిలో ఉన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికే బీజేపీ విధానాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ముద్ర లోన్లు, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాలు బీసీల సంక్షేమం కోసం తీసుకువచ్చారు. యూపీఏ హయాంలో కేంద్రంలో చిదంబరం మంత్రి పదవిలో ఉన్నప్పుడు, 2011లో సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల స్థితిగతులపై కులగణన జరిపారు. అయితే ఆ గణాంకాలను ఎందుకు బుట్టదాఖలుచేశారు? ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదు?
బీసీ రిజర్వేషన్ల విషయమై మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం… మరి కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదు? అక్కడ కూడా మీ ప్రభుత్వమే కదా? కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోంది. బీసీలకు పెద్దపీట వేసి న్యాయం చేసేది బీజేపీయే.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరుతున్నాం.