-ఎఫ్ ఆర్ బి ఎం లో మినహాయింపులు ఇవ్వండి
-ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
న్యూఢిల్లీ: తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. అలాగే ఎఫ్ఆర్బీఎం నిధుల విషయంలో మినహాయింపు కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఆ వివరాలివి.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా నాణ్యత, పిల్లల పోషకాహారం అనే రెండు సవాళ్లను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిందే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ ప్రోగ్రాంను పరిశీలించి, మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ జనాభాలో ఎక్కువ మంది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలకు చెందినవారున్నారు. SEEPEC డేటా ప్రకారం.. 56.33 శాతం మంది వెనుకబడిన తరగతుల నుంచి, 17.43 శాతం మంది షెడ్యూల్డ్ కులాల నుంచి, 10.45 శాతం మంది షెడ్యూల్డ్ తెగల నుంచి ఉన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తెలంగాణ ఒకటయినప్పటికీ విద్యా, పోషకాహార రంగాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఈ అసమానతలు తరతరాలుగా పేదరికాన్ని రూపుమాపనివ్వడంలేదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
ఏళ్లుగా ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశాయి. కానీ ఈ సంస్థలు చాలా వరకు అద్దె ప్రాంగణాల్లో లేదా చిన్న భవనాల్లో నడస్తున్నాయి. సమగ్ర మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు లేకుండా పనిచేస్తున్నాయని.. భట్టి కేంద్రమంత్రికి తెలిపారు. ఈ అంతరాలను పరిష్కరించడానికే.. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని రూపొందించింది. దీంట్లో భాగంగా 105 అత్యాధునిక, సాంకేతికత-ఆధారిత రెసిడెన్షియల్ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్కో స్కూల్లో 5నుంచి12 తరగతుల వరకు దాదాపు 2,560 మంది విద్యార్థులకు సేవలు అందించనున్నారు. ఈ పాఠశాలలు 2.7 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి. అదే సమయంలో దాదాపు 5,250 పొరుగు ప్రభుత్వ పాఠశాలలకు మద్దతు ఇచ్చే కేంద్రాలుగా పనిచేస్తాయి. తద్వారా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు పరోక్ష ప్రయోజనాలను అందిస్తాయని.. భట్టి విక్రమార్క వివరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ కేవలం కొత్త భవనాల గురించి కాదు.. ఇది బహుళ విభాగ అభ్యాసం, AI- ఆధారిత తరగతి గదులు, STEM, ప్రయోగశాలలు, బలమైన పోషకాహార సేవలు, క్రీడలు, కళలు, సురక్షితమైన సౌకర్యాలను అందివ్వనుంది. ప్రతి క్యాంపస్ సిబ్బంది నివాసాలు, ఆరోగ్య యూనిట్లు, కౌన్సెలింగ్ సేవలు, సౌర విద్యుత్తు, వాటర్ రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణ వంటి వ్యవస్థలు ఈ స్కూళ్లలో ఉంటాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణలోని పేద పిల్లల కోసం ప్రపంచ స్థాయి అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశ సమగ్ర, సమాన విద్యకు అనుగుణంగా ఉంటుందని.. కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్కు భట్టి విక్రమార్క వివరించారు.
సమగ్ర విద్యా విధానం కోసం అంచనా వేసిన ఆర్థిక వ్యయం రూ.30,000 కోట్లు. ఇందులో 105 క్యాంపస్ల నిర్మాణానికి రూ.21,000 కోట్లు, విద్యా రంగంలో అనుబంధ పెట్టుబడులకు రూ.9,000 కోట్లు అంచనా వేశాం. ఈ అనుబంధ పెట్టుబడులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలను బలోపేతం చేయడం, తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలు ఉన్నాయని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ వనరులను సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం, అనుబంధ పెట్టుబడుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించాలని ప్రతిపాదిస్తోంది. ఈ రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని.. భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇది సాధారణ ఖర్చు వినియోగం కంటే.. మానవనరుల అభివృద్ధిలో దీర్ఘకాలిక మూలధన పెట్టుబడి అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఈ మినహాయింపు వెనుకబడిన వర్గాలకు నాణ్యత విద్య, పోషకాహారం అందించడానికి సహాయపడుతోందని భావిస్తున్నాం. ఈ పెట్టుబడి పెట్టడం వలన ప్రారంభ వ్యయం కంటే.. అనేక రెట్లు ఎక్కువ సామాజిక, ఆర్థిక రాబడి లభిస్తుందన్నారు. పిల్లలు, యువతను అభ్యాసం, నైపుణ్యాలు, ఆరోగ్యంలో బలమైన పునాదులతో సన్నద్ధం చేయడం ద్వారా.. సామాజికంగా సమగ్రమైన పౌరుల తరాన్ని సృష్టిస్తుంది. ఇది భారతదేశ జనాభా డివిడెండ్కు నేరుగా దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమం పిల్లలు, యువతలో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం మద్దతుతో ఈ పాఠశాలలు జాతీయ నమూనాగా మారుతాయని గట్టిగా విశ్వసిస్తున్నాము. ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపును ఇస్తే.. నిధుల సమీకరణకు మార్గం సగమం అవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా అందించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం.. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఈ అంశాలను పరిశీలించి.. సానుకూల నిర్ణయం తీసుకోవాలని.. కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ను కోరారు.
అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని లోన్ రిస్ట్రక్చరింగ్ చేయాలని,రాష్ట్రంలో విస్తరంగా పామాయిల్ సాగు ఎక్కువగా ఉన్నందునని పామ్ ఆయిల్ పై విధించే సుంకం తగ్గించడం వలన రైతులు నష్టపోతున్నారని సుంకాన్ని పెంచాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.