– గురుపూజోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ “నాకు స్వార్థం ఉంది. ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే నేను కూడా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను. అలాగని ‘నేను ఫామ్ హౌస్లో పడుకుంటాను. మళ్లీ ముఖ్యమంత్రిగా చేయండి అని నేను అడగడం లేదు. మీతో పాటే నేను కూడా కష్టపడతాను” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేలా ప్రోత్సహిద్దామని ఆయన అన్నారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణమని వ్యాఖ్యానించారు. నేను కూడా విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో గురుపూజోత్సవం జరిగిందా? అందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖను తీసుకోవద్దని, ఆ శాఖ వివాదాస్పదం అని తనకు సూచించినా, తానే స్వయంగా ఆ శాఖను తన వద్ద ఉంచుకున్నట్లు చెప్పారు.