వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. తాజాగా టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిథున్ రెడ్డి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం తామంతా ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తామని వ్యాఖ్యానించారు.
బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పదజాలాన్ని వాడటం చర్చనీయాంశమైంది. పార్టీ పట్ల విధేయత చాటుకోవడంలో తప్పులేదు కానీ, ఆత్మాహుతి అనే పదం తీవ్రవాద భావజాలానికి దగ్గరగా ఉండటంతో రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మిథున్ రెడ్డి ఒక్కరే ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సైతం ఇదే తరహాలో స్పందించారు. జగన్ కోసం తామంతా ఆత్మాహుతి దళాలుగా మారతామని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
నాయకుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పే క్రమంలో వీరు వాడుతున్న ఈ పదజాలం, ప్రజాస్వామ్యయుతమైన ఒక రాజకీయ పార్టీ లక్షణాల కంటే ఉగ్రవాద సంస్థల పనితీరును ఎక్కువగా గుర్తుచేస్తోంది. ఒక రాజకీయ నాయకుడికి కార్యకర్తలు లేదా అనుచరులు ఉంటారు కానీ, ఇలా ‘దళాలు’ ఉండటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సాధారణంగా ఆత్మాహుతి దళాలు అనేవి భావజాల మత్తులో మునిగిపోయిన తీవ్రవాద సంస్థల్లో కనిపిస్తాయి. అక్కడ తర్కానికి తావుండదు; కేవలం ఆదేశాలను పాటించడం, ప్రాణాలను అర్పించడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా తమను తాము అదే కోవలోకి మార్చుకోవడం చూస్తుంటే, ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కంటే వ్యక్తి ఆరాధన పరాకాష్టకు చేరిందని అర్థమవుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం, కానీ హింసను ప్రేరేపించేలా లేదా ప్రాణత్యాగాలను ప్రోత్సహించేలా ఉండే ఇటువంటి భాష..ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
ఈ పరిణామాల నేపథ్యంలో, అసలు వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా లేక ఉగ్రవాద సంస్థా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాల్సిన ప్రజాప్రతినిధులు, వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చే దళాలుగా మారుతామని చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది.
రాజకీయాల్లో భాషా నైపుణ్యం, సంస్కారం ముఖ్యం. దానికి బదులుగా ఇలాంటి తీవ్రవాద స్థాయి పదజాలాన్ని ఉపయోగిస్తూ పోతే, అది భవిష్యత్తులో రాజకీయ హింసకు మరియు అరాచకత్వానికి దారితీసే ప్రమాదం ఉంది.
– చాకిరేవు