-తెలంగాణ పట్ల వివక్షత చూపుతున్న కేంద్ర ప్రభుత్వం
-రానున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లోనైనా తెలంగాణకు న్యాయం చేయండి
-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.తెలంగాణకు రైల్వే కొత్త లైన్ల మంజూరు చేసే విషయంలో న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినోద్ కుమార్ గురువారం లేఖ రాశారు.
రానున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లోనైనా తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ట్రం అని, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారని, దీంతో రైల్వే రవాణాకు ప్రాధాన్యత చేకూరుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
దీనికి తోడు ఇతర రాష్ట్రాలకు గతంలో వలస వెళ్లిన తెలంగాణవాసులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు, విద్యుత్ లభ్యత ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్ల స్వరాష్ట్రానికి ప్రజలు తిరిగి రావడానికి కారణం అని వినోద్ కుమార్ వివరించారు.ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, అందు కోసం రైల్వే కొత్త లైన్లను మంజూరు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ మాత్రమే మంజూరు అయిందని, అదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని సమకూర్చి మూడో వంతు నిర్మాణ ఖర్చును భరించినందుకే ఆ రైల్వే లైన్ వచ్చిందని వినోద్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర విభజన చట్టం 13 వ సెక్షన్ ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆరు నెలల కాలంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికి.. అది ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయిందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పితే రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఏవో కుంటి సాకులు చెబుతూ కేంద్ర రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కన పెట్టిందని వినోద్ కుమార్ ఆరోపించారు.
ఈ పెండింగ్ లో ఉన్న 11 ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి..
* కరీంనగర్ – మానకొండూర్ – హుజురాబాద్ – కాజిపేట్ ( 61.80 కి.మీ. )
* మంచిర్యాల – ఆదిలాబాద్ వయా ఉట్నూర్ ( 160 కి.మీ. )
* మణుగూరు – రామగుండం వయా భూపాలపల్లి ( 211 కి.మీ )
* నంద్యాల – జడ్చర్ల ( 182.4 కి.మీ )
* కోయగూడెం మైన్స్ – తడికలపూడి ( 19 కి.మీ )
* భద్రాచలం రోడ్ – విశాఖపట్నం ( 277 కి.మీ )
* హైదరాబాద్ – శ్రీశైలం వయా అచ్చంపేట ( 171 కి.మీ )
* సిద్దిపేట – అక్కన్నపేట్ ( 50 కి.మీ )
* వాషిం – మాహోర్ – ఆదిలాబాద్ ( 255 కి.మీ )
* పటాన్ చెరు – సంగారెడ్డి ( 89 కి.మీ )
* బై పాస్ లైన్ ఎట్ పగిడిపల్లి ( 10.20 కి.మీ )
పైన పేర్కొన్న 11 రైల్వే కొత్త లైన్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని, సంవత్సరాలు గడుస్తున్నా గిట్టుబాటు కాదని చెబుతూ కేంద్ర ప్రభుత్వం చలించడం లేదని వినోద్ కుమార్ ఆరోపించారు.
వీటికి తోడు మరో 25 రైల్వే కొత్త లైన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా కొన్నేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, డీ.పీ.ఆర్. పూర్తయిన ఈ ప్రతిపాదనలు మంజూరు కోసం తాము ఎదురు చూస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు.
ఆ 25 ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి…
* అప్ డేషన్ ఆఫ్ గద్వాల – మాచర్ల ( 184.20 కి. మీ )
* మౌలాలి – భువనగిరి ( 38 కి.మీ )
* మౌలాలి – ఘాట్ కేసర్ ( 12.8 కి.మీ )
* ఘట్ కేసర్ – భువనగిరి ( 25.2 కి.మీ )
* కాచిగూడ – చిట్యాల ( 87 కి.మీ )
* గడ్ చందూర్ – ఆదిలాబాద్ ( 70.19 కి.మీ )
* క్రిష్ణ – వికారాబాద్ ( 121.7 కి.మీ )

* జగ్గయ్యపేట – మిర్యాలగూడ ( 36.70 కి.మీ )
* పగిడిపల్లి – శంకర్ పల్లి ( 110 కి.మీ )
* పటాన్ చెరు – ఆదిలాబాద్ ( 316.77 కి.మీ )
* పాండురంగాపురం – భద్రాచలం ( 13 కి.మీ )
* సికింద్రాబాద్ – జహీరాబాద్ ( 63.5 కి.మీ )
* విష్ణు పురం – వినుకొండ ( 66 కి.మీ )
* కరీంనగర్ – హసన్ పర్తి ( 62 కి.మీ )
* మహబూబ్ నగర్ – గుత్తి ( 213.41 కి.మీ )
* సికింద్రాబాద్ – మూడ్ఖేడ్ – ఆదిలాబాద్ ( 383.48 కి.మీ )
* ఘన్ పూర్ – సూర్యాపేట వయా పాలకుర్తి ( 91.7 కి.మీ )
* బోధన్ – లాతూర్ రోడ్ ( 134.55 కి.మీ )
* యావత్ మాల్ – ఆదిలాబాద్ వయా ఘంటిగి ( 125.5 కి.మీ )
* కొత్తగూడెం – కొత్తపల్లి మధ్య సర్వే అప్ డేట్ పనులు ( 81.57 కి.మీ )
* సికింద్రాబాద్ – కాజిపేట్ మధ్య మూడవ లైన్ కోసం ( 85.48 కి.మీ )
* వికారాబాద్ వద్ద బై పాస్ లైన్ ( 2.6 కి.మీ )
* ఆర్మూర్ – ఆదిలాబాద్ మధ్య కొత్త లైన్ అప్ డేషన్ కోసం ( 136 కి.మీ )
* బిబినగర్ – గుంటూరు మధ్య ఎలక్ట్రిఫికేషన్ ( 239 కి.మీ )
* అకొలా – డోన్ మధ్య ఎలక్టరీఫికేషన్ ( 620.27 కి.మీ )
తెలంగాణ రాష్ట్రం పట్ల ఇప్పటికైనా వివక్షతను మానుకుని రానున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కొత్త లైన్లను మంజూరు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రైల్వే మంత్రికి డిమాండ్ చేశారు.