– ఒక ఛానల్లో కొందరు ఉద్యోగుల మాట్లాడిన భాష సరిగా లేదు
– వారిని ఉద్యోగ సంఘాల నాయకులు క్రమశిక్షణలో పెట్టాలి
– ఉద్యోగులు తమ న్యాయమైన హక్కులు కోరవచ్చు
– వాటిని చర్చల ద్వారా సాధించుకోవచ్చు
– అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరి కాదు
-ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటి?
-అలాంటి వారిని నాయకులు అదుపులో పెట్టాలి
-ఆందోళన చేస్తున్న ఉద్యోగుల మాటలు బాధాకరంగా ఉన్నాయి
-ప్రభుత్వంపైన, సీఎంపైన వ్యక్తిగత విమర్శలేంటి?
-ఇది ఏ మాత్రం సరి కాదు
-సీఎం తమ కోసం తపన పడుతున్నారని..
-అయితే ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నారనీ..
-ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పారు
-మీడియాకు గుర్తు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
తాడేపల్లి: మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..:
కోవిడ్ వల్ల రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. ఆదాయమూ తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సినంతగా నిధులు రాలేదు. ఉద్యోగ సంఘాలు సీఎంతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించటం జరిగింది.రాజకీయ పక్షాలు ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తాయి. అది వారికి అలవాటు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా టీవీల్లో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వారి మాటలు బాధ్యతారహితంగా, బాధాకరంగా ఉంటున్నాయి. సీఎంపై వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా, ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. ఇది ఏ మాత్రం సరి కాదు.
వ్యక్తిగతంగా అటువంటి భాషతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తులతో, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై అలా మాట్లాడడం ధర్మమేనా? సంఘ నాయకులు అటువంటి వారిని కట్టడి చేయాలి.
ఓ మహిళా టీచర్ ఏబీఎన్ ఛానల్లో మాట్లాడుతోంది. ఆ ఛానల్ వారు వచ్చి మాట్లాడిస్తే ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఇది ఒక సాంప్రదాయమా. మేం ఒక్కరమే ఉన్నాం అనుకుంటే, మిగతా రంగాలు, వర్గాలు ఏమవ్వాలి. అది కరెక్టు కాదు కదా?
ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని పెద్ద మాటలు నేను మాట్లాడటం లేదు. దయచేసి ఉద్యోగ సంఘాలను అభ్యర్థిస్తున్నాను. మీకున్న (ఉద్యోగ సంఘాలకు) అధికారాల్ని, హక్కులను ప్రభుత్వం కాదనటం లేదు. అందువల్ల ముందుకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడండి.
అందరికీ మేలు జరగాలని సీఎం వైయస్ జగన్ కోరుకుంటున్నారు. నిజానికి సీఎం కూడా తమ కోసం తపన పడుతున్నారని, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నీ చేయలేక పోతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు స్వయంగా చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఉద్యోగులంతా సంయమనం పాటించాలని కోరుతున్నాను.
ఉద్యోగ కుటుంబ సభ్యులూ ప్రజలే. మా కుటుంబాల సభ్యులూ ప్రజలే. ఆందోళన చేస్తే అందరికీ ఇబ్బంది వస్తుంది. అలాంటి ప్రజలకు ఇబ్బందులు తేవొద్దని కోరుకుంటున్నాం. ప్రతిదీ ఎంతో పారదర్శకంగా చేస్తున్నాం. అందువల్ల ఉద్యోగులు ఎవరి వలలో పడొద్దని, సానుకూల దృక్పథంతో ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.