-గతంలో మా ఫోన్లను చంద్రబాబు హ్యాక్ చేయిస్తున్నారని గ్రహించాం
– ఇప్పటికైనా పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ విషయంలో చంద్రబాబు నోరు విప్పాలి
– ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పింది నిజమో, అబద్ధమో చంద్రబాబే చెప్పాలి
– ప్రత్యర్థి పార్టీలపై నిఘాకై పెగాసస్ను చంద్రబాబు కొన్నారు
– డేటా లీక్ ద్వారా టీడీపీ బుద్ధి బయటపడితే..పెగాసస్తో బాబు మోసం బట్టబయలైంది
– పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ విషయంలో దర్యాప్తుకు వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది
– వైయస్ఆర్సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
అబ్బయ్య చౌదరి ఇంకా ఏమన్నారంటే..
పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ కొనుగోలు ద్వారా చంద్రబాబు కుతంత్రం బయటపడిందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. టెక్నాలజీ అంటే తనేనని చంద్రబాబే ఎప్పుడూ చెప్పుకుంటారు. ఆయన వాడిన టెక్నాలజీ పేరు పెగాసస్ అని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. పెగాసస్ నిఘా టెక్నాలజీ ఆయన వాడారు. ఐటీ ప్రపంచాన్ని దేశానికి తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు చేసిన నిర్వాకం పెగాసస్ స్పై సాఫ్ట్వేర్.
పెగాసస్ స్పై సాఫ్ట్వేర్తో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. అధికార దాహంతోనే ప్రత్యర్థి పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పెగాసస్ చంద్రంబాబు కొన్నారు. 2019లో చంద్రబాబుతో రాజకీయంగా జతకట్టిన మమతా బెనర్జీనే బాబు చేసిన పెగాసస్ నిర్వాకంపై చెప్పారు.
గతంలో ఓటుకు నోటు కేసులో నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారని ఆనాడు చంద్రబాబు అన్నాడు. అప్పట్లో సెక్షన్ 8 అన్న చంద్రబాబు.. ఆంధ్రాకి రాగానే ఏ సెక్షన్ ప్రకారం పెగాసస్ వాడారు. ఆరోజున ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. 2018లో జీఓ నెంబర్ 184 చంద్రబాబు ఇచ్చారా? లేదా? ఆ జీఓ ప్రకారం రాష్ట్రంలోని టెలిఫోన్లు, మొబైల్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ISP) ట్యాపింగ్ చేసే అధికారాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చంద్రబాబు కట్టబెట్టారు.
దీని ప్రకారం.. ఇంటెలిజెన్స్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు ట్యాపింగ్ చేయవచ్చన్నారు.పెగాసస్ స్పైవేర్ విషయంలో ప్రత్యర్థులుగా మేమేమీ విమర్శలు చేయటం లేదు. 2019లో మోడీ ఉంటే ప్రమాదమని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మమతా బెనర్జీతో కలిసి అన్ని రాష్ట్రాలు తిరిగారు. ఆ మమతా బెనర్జీనే పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ చంద్రబాబు కొన్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
ఇప్పుడు మమతా బెనర్జీ మాటలు దేశమంతా చర్చనీయాంశం అయ్యాయి. అధికారంలో ఉండాలని చంద్రబాబు చేసే ప్రలోభాలు రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెల్సు. కానీ ఇప్పుడు దేశ ప్రజానీకానికి కూడా చంద్రబాబు ఏంటో తెల్సిపోయింది.
పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుస్తోందని, వైయస్ఆర్సీపీ, బీజేపీ ఓటర్ల లిస్టు డిలీజ్ చేస్తున్నామని మమతా బెనర్జీకి చంద్రబాబు చెప్పారంట. పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ విషయంలో మమతా బెనర్జీ స్పందించిన మరుక్షణం టీడీపీ నేతలు అంతా స్పందిస్తున్నారు.
మమతా బెనర్జీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని లోకేశ్ అన్నారు. దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే పరిస్థితి. మమతా లేవనెత్తిన అంశంపై చంద్రబాబు, లోకేశ్లు సమాధానం చెప్పాలని అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు.
తప్పు చేయకపోతే.. పరువు నష్టం కేసులు వేస్తామని చంద్రబాబు, లోకేశ్ అంటుంటారు. మరి, మమతా బెనర్జీ చెప్పింది తప్పు అని ఇంతవరకు చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. అంటే, రాష్ట్ర ప్రజలతో పాటు.. రాజకీయ నాయకులు, జడ్జీల వరకు అందరిపైనా నిఘా వేయెచ్చు. అందుకే చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్లో ఉండి ఈ సాఫ్ట్వేర్ వాడుతున్నారేమో అని అబ్బయ్య చౌదరి అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో 3.50 కోట్ల మంది డేటాను చంద్రబాబు దగ్గర పెట్టుకొని ప్రజల్ని మోసం చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్కృష్ణ ఆకాశ్ అడ్వాన్స్ సిస్టమ్స్ ద్వారా ఇజ్రాయిల్కు చెందిన కంపెనీ ద్వారా రూ.25 కోట్లతో స్పై సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా?
ఆ స్పై సాఫ్ట్వేర్ కొన్నది నిజమా? కాదా? ఈ స్పై సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న ఇజ్రాయిల్ వెళ్లారా? లేదా? ఆ స్పై పరికరాలను ఎంతో రహస్యంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై గతంలో హైదరాబాద్ పోలీసులకు వైయస్ఆర్సీపీ కంప్లైంట్ చేసింది.
ఐటీ గ్రిడ్స్ కంపెనీలో రాష్ట్ర ప్రజల డేటా బయటపడింది. ఐటీ గ్రిడ్స్ చెందిన రెండు కార్యాలయాల్లో ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు, కీలక పత్రాలు, డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది అబద్ధమని చంద్రబాబు, లోకేశ్ చెప్పగలరా? దీనికి చంద్రబాబు, లోకేశ్ బాధ్యత వహించాలి.
పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్ఓ (NSO) గ్రూపు తయారు చేసింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టెర్రరిస్టులు, సంఘవిద్రోహశక్తులను పట్టుకోవటానికి తయారు చేశారు. పెగాసస్ను ప్రపంచదేశాలకు అమ్మే ప్రయత్నం చేశారు. ఈ పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ విషయంలో మెక్సికో, ఫ్రాన్స్, ఈజిప్టు, సౌతాఫ్రికా అధ్యక్షులు స్పందించారు.
ఈ పెగాసస్ స్పై సాప్ట్వేర్ ద్వారా ఫోన్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్లోకి పంపిస్తారు. ఆతర్వాత మన ఫోన్లోకి వచ్చే మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు, డేటా అంతా దూరంగా ఉండి గమనిస్తారు. ఆ సాఫ్ట్వేర్ మన ఫోన్లో ఉంటే.. మనం గదిలో ఉన్నా.. మైక్రోఫోన్ ద్వారా ఆటోమ్యాటిక్గా రికార్డ్ చేస్తుంది. దూరంగా ఉండి మొత్తం వినొచ్చు. చూడొచ్చు. ఇది భయంకరమైన విషయం. పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ వల్ల మనం మన కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేం.
పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను మన దేశంలో కొన్నారని 2017లోనే న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. తర్వాత దీనిపై పార్లమెంట్లోనూ చర్చించారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ప్రొఫెసర్ చౌదరీ, ప్రొఫెసర్ ప్రభాహరణ్, అనిల్ గుమస్తే అనే ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మా ఫోన్లు హ్యాక్ చేశారు. ఆరోజే కుట్ర జరగబోతోందని మేం అనుమానించాం. టెక్నాలజీ అంటే చంద్రబాబు కాదు.. పెగాసస్ స్పై సాఫ్ట్వేర్. ఆ స్పై సాఫ్ట్వేర్ తెచ్చి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారనే విషయాన్ని మేం ఆరోజు గ్రహించలేకపోయాం. గతంలో మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ట్యాప్ చేసిన సంగతిని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ చేయమని లేఖ రాశారు.
చంద్రబాబు బాగోతాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ బయటపెట్టారు. కాబట్టి.. తక్షణం ఈ పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఈ పెగాసస్ దేశభద్రతతో ముడిపడి ఉంది. ఈ స్పై సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ, విదేశీ వ్యవహారాల అనుమతి తీసుకొని ఉండాలి. కేంద్ర అనుమతి లేకుండా పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ కొంటే చంద్రబాబు, లోకేశ్లు నేరస్తులు. ఈ అంశంలో పూర్తి దర్యాప్తు జరిగే వరకు వైయస్ఆర్సీపీ వదిలిపెట్టేది లేదని అబ్బయ్య చౌదరి అన్నారు.