– వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం
– రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం
– సీఎం జగన్
సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది
ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్ కోరారు. ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల’ని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు.
జగన్ నివాసంలో తేనీటి విందు
అంతకుముందు.. తన నివాసానికి వచ్చిన ద్రౌపది ముర్ముకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతీరెడ్డి ఆహ్వానం పలికారు. అక్కడ ఆమెకు జగన్ దంపతులు తేనీటి విందు ఇచ్చారు. ఆ సందర్భంగా దుర్గామల్లీశ్వరస్వామి దేవాలయానికి చెందిన వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.