Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ప్రమాణ స్వీకారంతో ఆంధ్రప్రదేశ్‌ లో నూతన శకం ఆరంభం

– 2024 ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు
– ఎంపీ విజయసాయిరెడ్డి

మే 30: 2019 మే 30న ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారి అధికారం చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సాధించి తెలుగునాట చరిత్ర తిరగరాసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఈ అంశానికి సంబంధించి పలు విషయాలు తెలిపారు.

అప్పటికి పదేళ్ల క్రితం 2009 మే మాసంలో కడప నుంచి లోక్‌ సభకు భారీ మెజారిటీతో ఎన్నికైన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆ దశాబ్ద కాలంలో ఏ యువ రాజకీయ నాయకుడు ఎదుర్కొనని అడ్డంకులు, ఇబ్బందులు ధైర్యంగా అధిగమించిన విషయాన్ని గుర్తుచేశారు. తన తండ్రి, జననేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలో జనం మధ్య దివిటీలా కదులుతూ సుదీర్ఘ పాదయాత్రలతో తెలుగునాట ప్రజల కష్టాలు తెలుసుకున్నారని అన్నారు. 2019 వరకూ నాటి పాలకపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి, అణచివేత చర్యలకు ఎదురు నిలిచి పోరాడారని చెప్పారు.

చెప్పుకోదగ్గ సంఖ్యలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం తెలుగుదేశం పార్టీ తన అధికారంతో తన వైపుకు తిప్పుకున్నా జగన్‌ చలించలేదు, జంకలేదని అన్నారు. నిరంతరం ప్రజల మధ్య తిరగడంతో వారి అవసరాలేమిటో ఆయనకు తెలిశాయని అన్నారు. ఓదార్పు, పాదయాత్రల్లో తాను స్వయంగా జనం కష్టాలను అర్ధంచేసుకుని, వారి కన్నీళ్లు తుడవడానికి అవసరమైన రీతిలో ఎన్నికల ప్రణాళికను ఆయన రూపొందించారని.తెలిపారు.

నవరత్నాలు వంటి వినూత్న పథకాలు, హామీలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలుగునాట ఒకేసారి వచ్చిన ఏపీ శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి చరిత్రాత్మక విజయం సాధించిందని తెలిపారు. 2019లో 150వ రోజు అయిన మే 30, గురువారం జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి రావడంతో ప్రతి ఇంటా లక్ష్మీ దేవి అడుగుబెట్టినట్టయిందని విజయసాయిరెడ్డి అన్నారు.

గురువారం వచ్చిన ప్రభుత్వంతో జనానికి డబ్బుకు ఇబ్బందే లేదు
రాష్ట్ర ప్రభుత్వ వినూత్న విధానాలతో పేదలు, బడుగు వర్గాల కొనుగోలు శక్తిని వరదలు, వానలు వంటి ప్రకృతి వైపరీత్యాల కాలంలోనే గాక, కొవిడ్‌–19 వంటి విశ్వవ్యాప్త మహమ్మారి రాష్ట్ర ప్రజలను వేధిస్తున్న సమయంలో కూడా పెంచడానికి వైఎస్సార్సీపీ సర్కారు నగదు బదిలీ పథకాలు ఉపకరించాయని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రా జనం డబ్బుకు ఇబ్బంది పడలేదు. లక్ష్మివారం అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతటి క్లిష్ట సమయంలోనైనా ప్రజలను ఆదుకోవడానికి డబ్బు ఏదో విధంగా సమకూరుతూనే ఉందని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బృందం నిరంతర కృషితో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పరుగులు తీస్తోందని అన్నారు.

తమ జీవితాల్లో ఇలా తాము ఊహించని మంచి మార్పులకు దోహదం చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే మరో ఏడాది కాలం ముందుకు సాగాలని, తమను మరింత మెరుగైన జీవనస్థాయికి తీసుకెళ్లడానికి ఈ పార్టీ 2024 ఎన్నికల్లో విజయదుందుభి మరోసారి మోగించాలని ఐదున్నర కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని కలలు కనే ఏ ప్రభుత్వానికైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

2023 మే 30 మంగళవారం ఐదో ఏట అడుగిడిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించి ప్రజాసేవకు పునరంకితం కావడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గొప్ప అవకాశం కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ప్రజా కల్యాణమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాన్ని నడిపే రాజకీయపక్షానికి ప్రజలు వరుసగా నాలుగైదు ఎన్నికల్లో గెలిపిస్తారని ఇది వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రుజువైంది. అదే ఒరవడి నవ్యాంధ్ర ప్రదేశ్‌ లో కూడా 2019 నుంచి కొనసాగుతుందని రాజకీయ పండితులకు అర్ధమౌతోందని విజయసాయిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE