Suryaa.co.in

Telangana

భారీ వర్షాల ప‌ట్ల అప్ర‌మ‌త్తం

-యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేప‌ట్టాలి
-పున‌రావాస ఏర్పాట్ల‌పై దృష్టి సారించండి
-అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి
-అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దు
-గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని ములుగు, భూపాల‌ప‌ల్లి, వరంగల్ నగరం, ఉమ్మడి -జిల్లా క‌లెక్ట‌ర్లు, సీపీ, ఎస్పీల‌కు, ఇత‌ర ఉన్న‌తాధికారులకు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దిశా నిర్దేశం

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ త‌దిత‌ర జిల్లాల క‌లెక్ట‌ర్లు, సీపీ, ఎస్పీలు, పంచాయ‌తీరాజ్ శాఖ, ఇత‌ర సంబంధిత శాఖ‌ల‌ అధికారులతో మంత్రి సోమ‌వారం టెలీఫోన్ లో మాట్లాడారు. మ‌రోవైపు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, తదితర అధికారులను కూడా అప్ర‌మ‌త్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయి. మ‌రికొద్ది రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరిస్తున్న‌ది. ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల రాష్ట్రంలోని ప్ర‌భావిత ప్రాంతాలు, ప్ర‌త్యేకించి ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, కాజీపేట, జ‌న‌గామ‌ ప్రాంతాల్లో అధికారులు అలెర్ట్‌గా ఉండాల‌ని ఆదేశించారు.

ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల పరిస్థితి పై మంత్రి ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అలెర్ట్ గా ఉండాలన్నారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో కృషి చేసి ఏ చెరువు గాని,రోడ్డు గాని,తెగిపోకుండా చూడాలని అయన కోరారు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని అయన కోరారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని అయన కోరారు. భారీగా వర్షం పడుతున్న సందర్బంగా ముందు జాగ్రత్తగా చర్యగా తాత్కాలికంగా ఆ ప్రాంతాలో విద్యుత్ ను నిలిపివేసి నష్టాన్ని నివారించాలని అన్నారు. వరద నష్ఠాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, వరంగల్ నగర పాలక సంస్థ కార్యలయంలో ఏర్పాటు చేయాలని అయన కోరారు.

మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కు ఆటంకాలు రాకుండా చూడాల‌ని, ఒక‌వేళ ఎక్క‌డైనా స‌మ‌స్య‌లు త‌లెత్తితే వెంట‌నే పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వరద నీటి కోతకు రోడ్లు తెగుతున్నాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఒకవైపు పి అర్ రోడ్ల ను పరిరక్షించాలి. అలాగే కోతలకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు సేకరించాలని, వాటి పునరుద్ధరణ, మరమ్మతుల చర్యలకు ఉపక్రమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.

వర్షాలకు బాగా కురుస్తున్న కారణంగా, రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, వర్షాకాల సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశిచారు వెంటనే జిల్లా పరిషత్ సీఈఓ లు, ఎంపిడిఓ లు, ఎంపీఓ లు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. ప్రజలు సైతం వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని, రోడ్ల మీదకు రావద్దని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

LEAVE A RESPONSE