– అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరు
– అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలి
– మార్చి నెలాఖరుకు అధికారులు,ఉద్యోగులకు భవనాలు సిద్దం చేస్తాం
– రాజధానిలో పర్యటన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ
అమరావతి: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేసారు. కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు అమరావతిలో ఎలాంటి పనులేమీ జరగడం లేదని గ్రాఫిక్స్ మాత్రం చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరని అన్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వారు క్షేత్ర స్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలని హితవు పలికారు.
రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ -1,టైప్ -2 భవనాలతో పాటు గ్రూప్ – డి ఉద్యోగుల భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి. ఎప్పటి వరకూ పూర్తవుతాయి. భవనాలతో పాటు ఇతర మౌళిక వసతుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సీఆర్డీఏ ఇంజినీరింగ్ అధికారులను,కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి పనుల్లో ప్రస్తుతం 13వేల మంది ఉద్యోగులు,కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు…అలాగే ప్రొక్లెయిన్ లు,జేసీబీలు,ఇతర యంత్రాలు సుమారు 2500 వరకూ పనిచేస్తున్నాయి. వర్షాలు కూడా తగ్గడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయని మంత్రి చెప్పారు.
గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ -1 భవనాల్లో 4 టవర్లలో 384 ఫ్లాట్లు,ఒక్కొక్కటి 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 9.62 లక్షల విస్తీర్ణంలో పనులు వేగంగా జరుగుతున్నాయి.ఇక టైప్ -2 భవనాల్లో మరో 4 టవర్లలో 336 ఫ్లాట్లు ఒక్కొక్కటి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7.4 లక్షల విస్తీర్ణంలో జరుగుతుంది…మరోవైపు గ్రూప్ – డి ఉద్యోగుల కొరకు మొత్తం 6 టవర్లలో 720 ఫ్లాట్లు ఒక్కొక్కటి 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10.2 లక్షల విస్తీర్ణంలో వేగంగా నిర్మాణం జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.
మొత్తంగా 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1440 ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. శ్లాబ్ పనులు దాదాపు పూర్తికాగా…మిగిలిన వాటికి నవంబర్ నాటికి పూర్తవుతాయి. సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. అన్ని భవనాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా వెళ్తున్నట్లు మంత్రి చెప్పారు. వీటిలో 50 శాతం ఇళ్లు అక్టోబర్ రెండు నాటికి పూర్తవుతాయని, అయితే అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు అప్పగిస్తామన్నారు.
అమరావతి చాలా సేఫ్ సిటీ
అమరావతిలో 360 కిమీ మేర ట్రంక్ రోడ్లు,1500 కిమీ మేర లే అవుట్ రోడ్లు,4000 నివాస భవనాలు,ఐకానిక్ భవనాలు పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి.కానీ అమరావతిలో పనులేమీ జరగడం లేదని పనిగట్టుకుని కొంతమంది దుష్ఫ్రచారం చేస్తున్నారు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది.
అమరావతి అంతా గ్రాఫిక్స్ అంటున్న వారిని ప్రజలు క్షమించరని, అమరావతి చాలా సేఫ్ సిటీ అన్నారు.అమరావతిలో వరద నివారణ కొరకు నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించామన్నారు. అమరావతికి ఎలాంటి ముంపు లేకుండా కాలువలు,రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నారు. ఏది ఏమైనా చెప్పిన ప్రకారం మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు.