Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి

-పదోన్నతి విషయంలో ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ దాఖలు చేసిన కేసులో హాజరు
-రాజశేఖర్‌ డీపీఆర్‌ సంతృప్తిగా లేదన్న ప్రభుత్వం
-కేరళలో ఉన్నందున రాలేకపోతున్నానన్న మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌
-వచ్చే విచారణకు డీజీపీకి వ్యక్తిగత హాజరు మినహాయింపు

అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డి సోమవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ కూడా కోర్టుకు రావాల్సి ఉంది. కేరళలో సమావేశానికి హాజరు అయినందున రాలేకపోతున్నందుకు మన్నించాలని, తదుపరి విచారణకు హాజరవుతానని ఆయన అఫిడవిట్‌ దాఖలు చేశారు.

న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ రాజశేఖర్‌కు పదోన్నతి కల్పించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబరు 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో రాజశేఖర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి పూర్వ డీజీపీ, ప్రస్తుత డీజీపీలు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన విచారణకు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హాజరయ్యారు. ఆయన తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ ‘రాజశేఖర్‌ ఏసీఆర్‌ (వార్షిక రహస్య నివేదిక) సంతృప్తికరంగా లేదు. ఆయన పదోన్నతి ప్రతిపాదనను డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతి కమిటీ (డీపీసీ) తిరస్కరించింది.

పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ పదోన్నతి కల్పించే విషయంలో అన్ని అంశాలను పునఃపరిశీలన చేయాలని సూచించారు. కౌంటర్‌ వేసేందుకు సమయం ఇస్తూ విచారణను వాయిదా వేశారు. తదుపరి విచారణకు హాజరు నుంచి డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి మినహాయింపు ఇచ్చారు.

LEAVE A RESPONSE