– కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి ఆ గోదావరి నీళ్లను తెస్తున్నారా?
– లేక ఎక్కడి నుంచైనా గాలిలో నుండి తెస్తున్నారా?
– మూసీ సుందరీకరణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– లక్ష కోట్లా? లక్షన్నర కోట్లా? అసలు అంచనా ఎంతో చెప్పాలి
– నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా?
– పేదల ఇళ్లు కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం
– అసెంబ్లీ క్వశ్చన్ అవర్ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్: ముందుగా మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలి. ఒకసారి ముఖ్యమంత్రి లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలి.
పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారు. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
మూసీ సుందరీకరణలో ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూ సేకరణ చట్టం కింద కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా?
2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 14న్నర లక్షల డబ్బు ఇవ్వాలి. వాళ్ల పాత ఇంటికి ఆర్ అండ్ బి ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలి. అలాగే సేలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు?
ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన కూల్చవలసిన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్ని? ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు? మంత్రి సమాధానం చెబుతూ హెచ్ఎండబ్ల్యూఎస్ నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పంపింగ్ చేయడానికి పట్టిందని, మూసీ నదిలో ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి రెండున్నర టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగిందని అన్నారు.
స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసిలో వదులుతామన్నారు. అసలు ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి ఆ గోదావరి నీళ్లను తెస్తున్నారా? లేక ఎక్కడి నుంచైనా గాలిలో నుండి తెస్తున్నారా? ఆ రెండున్నర టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలి.
మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో చెప్పినట్లుగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని అయినా అడ్డుకుంటాం. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టండి. కానీ, మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.