Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారు

– తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న అధికార దాహంతో ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అడ్డమైన హామీలను జగన్ రెడ్డి గుప్పించారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో అధికారంలోకి వచ్చిన వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన మాట ముఖ్యమంత్రి మర్చిపోయినా..నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతుంటే రెండు రోజుల నుండి ఉపాధ్యాయ సంఘాలను నేతలను అరెస్టులు చేస్తున్నారు.

తాడేపల్లి ప్రాంతమంతా ముళ్లకంచలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. న్యాయబద్ధమైన హక్కులను అడిగితే అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ అబద్ధమాడడు.. జగన్ మాట ఇస్తే తప్పడు అంటూ సినిమా డైలాగులు కొట్టారు. ఇచ్చిన మాట మీద జగన్ రెడ్డి నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ కు అవగాహన లేక సీపీఎస్ రద్దు చేస్తానన్న హమీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పీఆర్సీ అమలులోనూ ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో బస్సుల రవాణాను కూడా నిలిపివేసి సామాన్యులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే చర్యలు ముఖ్యమంత్రి ఎందుకు చేపట్టడం లేదు. తాడేపల్లిలో తప్పించుకున్నామని సంబరపడ్డా భవిష్యత్ లో రాష్ట్రంలో తిరిగేటప్పుడైనా నిరసనలు ఎదుర్కోక తప్పదు.
ఉద్యోగులకు కనీసం జీతం కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జగన్ రెడ్డి చేసిన మోసాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలదీయాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది. జగన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు ఉద్యోగుల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుంది.

LEAVE A RESPONSE