– సంప్రదాయం ఆధునికతల మేళవింపుగా వేడుకలు
– ఎల్ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు
– సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకం అయ్యేలా ఏర్పాట్లు
– సకల జనుల సమ్మేళనంతో బతుకమ్మ ఉత్సవాలు
– బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష
హైదరాబాద్: సంప్రదాయం ఆధునికతల మేళవింపుగా, సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకం అయ్యేలా, సకల జనుల సమ్మేళనంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. గ్రామాలతో పాటు హైదరాబాద్లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దిశానిర్ధేశం చేశారు.
బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, మన సంస్కృతి, సాంప్రదాయలు ఉట్టిపడేలా, ప్రకృతి, పర్యాటకం, పర్యావరణం థీమ్ రూపకల్పన చేయాలని, వీటిని ప్రతీ ఒక్కరూ కాలర్ ట్యూన్స్, సోషల్ మీడియా స్టేటస్ లుగా పెట్టుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణ అనంతరం పూలు, ఇతర సామాగ్రిని వృదాగా పారబోయకుండా వాటితో పర్యావరణహిత వస్తువులు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు.
ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న వేడుకలను.. మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలు చేయాలన్నారు. విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ఈ నెల 21వ తేదీన వరంగల్లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
హైదరాబాద్లో కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల్లోనూ సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని అన్నారు. విద్యార్థులంతా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేలా కళాశాల, యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్లు పండుగ దిగ్విజయంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. సాంస్కృతిక కళాసారధులు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
ఈ సమీక్షలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీ డెరెక్టర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.