Home » భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండం

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండం

• ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో హోంమంత్రి అనిత
• 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా
• వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
• ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ ను స్వయంగా పరిశీలించిన మంత్రి అనిత
• ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విధులను మంత్రి అనితకు వివరించిన అధికారులు

విజయవాడ ; ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐఎండి అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడూ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జూన్ నెలలో ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో అత్యధికంగా 184 మి.మీ అతిభారీ వర్షపాతం నమోదైందన్నారు. తరచూ వరదలు సంభవించే నదీపరివాహక ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్..
అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అనిత సమీక్షించారు. తుఫాను ప్రభావంతో నదీపరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా గోదావరి, వంశధార, నాగావళి తదితర నదుల్లోకి వరద నీరు చేరుతోందని అన్నారు. వర్షాలు, వరదలపై ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారన్నారు.

ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ.. వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వర్షాలు, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో దేవీపట్నం నదీపరివాహక ప్రాంతంలో వీఆర్వో, వీఆర్ఏలతో పాటు ఇతర అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారని, సహాయక చర్యల నిమిత్తం గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

డా.బి.ఆర్.అంబేద్కర్, శ్రీకాకుళం జిల్లా డీఆర్వోలు మాట్లాడుతూ.. అధిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ.. అధికారులు అలర్ట్ గా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల సంభవించే పరిస్థితులపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాలైన నాసిక్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గొట్టా బ్యారేజీ వంటి తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో తహశీల్దార్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ పరిశీలన..
స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించగా 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని అధికారులు మంత్రికి విశదీకరించారు. కామన్ అలెర్ట్ ప్రోటోకాల్ , ఏపీ అలెర్ట్ సెంటర్ ద్వారా ప్రజలకు హెచ్చరిక సందేశాలు ఏవిధంగా చేరుతాయో ప్రత్యక్షంగా చూపించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ , వాకీటాకీ, వి-శాట్ కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా.. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు, సిబ్బంది పనితీరును మంత్రి ప్రశంసించారు.
అనంతరం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ఈడీ సి.నాగరాజు, సంస్థ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply