– సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– మంత్రి సత్యకుమార్ ఆదేశాలు
అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలను త్వరితగతిన తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లోని తాజా పరిస్థితులపై అధికారులు మంత్రికి సోమవారం వివరించారు. వెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రజలకుండా ఉండేందుకు ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వచ్చేనెల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అంటు రోగాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అలసత్వానికి తావివ్వొద్దన్నారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మండలాల వారీగా కేసుల నమోదు తీరుపై సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా చూసినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు. గ్రామాల్లో పనిచేసే సీహెచ్ ఓలు జిల్లా అదికారులు నిర్దేశించిన సమయాల్లో తాగునీటి నమూనాలు, సేకరించి పరీక్షలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
నీటి ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మున్సిపల్, పంచాయతీ, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైద్యుల సూచించిన మేరకు ప్రసవ తేదీలాధారంగా గర్భిణుల వివరాలు సేకరించి, వారికి వైద్య సేవలు సకాలంలో అందడంలో ఎటువంటి అవరోధం రాకుండా చూడాలని మంత్రి సర్యకుమార్ సూచించారు.
ఇందుకు ఆశా, ఎ.ఎన్.ఎం.ల సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గతానుభవాల్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు పటిష్ఠంగా తీసుకుంటున్నామన్నారు. అవసరాలకనుగుణంగా వాడుకునేందుకు కూడా అంబులెన్సులను మ్యాపింగ్ చేసినట్టు వెల్లడించారు.