Suryaa.co.in

Telangana

బీజేపీ,టీఆర్ఎస్ లకు ఓట్లు వేస్తే దేశాన్ని అమ్ముతారు

-దేశ ఆస్తులను అంబానీ, ఆధానీలకు అమ్ముతున్న బిజెపి
-మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి
-కాంగ్రెస్ గెలిపిస్తేనే పెరిగిన ధరలు దిగుతాయి
-మునుగోడు మండలం కొరటికల్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం పోసి, డబ్బులు పంచి, మధ్యం మత్తులో ఉంచి, మనం ఆలోచన చేయకుండ ప్రలోభాల్లో ముంచెత్తి, మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని టీఆర్ఎస్ బిజెపి పార్టీలు మన ఊరును, మన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్ముకుంటారని, వారు చేస్తున్న ప్రలోభాల పట్ల మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే భవిష్యత్తు అందకారంగా మారుతుందని” సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

మంగళవారం రాత్రి మునుగోడు మండలం కొరటికల్ గ్రామాంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడులో ఓట్లను కొనుగోలు చేయడానికి బిజెపి,టీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా డబ్బుల సంచులతో దిగాయన్నారు. దేశ ఆస్తులును ఇప్పటికే కార్పోరేట్ శక్తులైన అంబాని, ఆధానీలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమ్ముతున్నదని, మునుగోడులో బిజెపిని గెలిపిస్తే వారికి దేశాన్ని అమ్మకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుందన్నారు.

అచ్చేదిన్ తీసుకువస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ రోజు రోజుకు పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, పెంచి సచ్చెదిన్ తీసుకొచ్చారని, మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి వాత పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే పెరిగిన ధరలు తగ్గుతాయన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దలితులకు మూడు ఎకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో వాత పెట్టాలని కోరారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకుండ ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి, ధరలు పెంచుతూ ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్లకు దారదత్తం చేస్తున్న బిజెపికి ఈ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తే వారు దేశాన్ని అమ్మేస్తారని వివరించారు. ఓటు వేసే ముందు పది నిమిషాలు ప్రశాంతంగా ఆలోచన చేయాలని సూచించారు.

“మనలని అభివృద్ది చేసింది ఎవరు? ఆరోగ్య శ్రీ కార్డు ఇచ్చి ఉచిత వైద్యం అందించింది ఎవరు? ఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చి ఉచితంగా విద్య ఇచ్చింది ఎవరు? వలసలు నివారించడానికి గ్రామాల్లో ఉపాధి పనులు తెచ్చింది ఎవరు? నాగార్జున్ సాగర్ కట్టి సాగు, త్రాగు నీరు ఇచ్చింది ఎవరు? భవిష్యత్తులో మనలను అభివృద్ధి చేసేది ఎవరని” పది నిమిషాలు ఆలోచన చేస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు మీ కండ్ల ముందు కనిపిస్తాయన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి, ప్రజ సంక్షేమం సాధ్యమన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల మనిషిగా చివరి శ్వాస వరకు పని చేసిన నిస్వార్ధనాయకుడు స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ ఆశయ సాధన కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన బిడ్డ మన మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వర్ రావు, రాందాసునాయక్, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE