– చూసుకోని ముర్వ .. చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి
– పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదు మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదు. శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఒక్క ఇటుక కూడా వేయలేదు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్పడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలి పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు .. చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయి.కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారు.సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు .. అభివృద్ధి పనులు పక్కన పెట్టారు. రైతులను గాలికి, పంటలను వాటి కర్మానికి వదిలేశారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పారు .. బ్రోకర్ల అవతారం ఎత్తారు.
తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. కరోనా కష్టకాలం లోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగింది.కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది – 0.76 % శాతానికి పడిపోయింది. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనం. కూట్లో రాయి తీయలేనోడు .. ఏట్ల రాయి తీస్తా అన్నాడట .. కొడంగల్ సభలో రేవంత్ 2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని చెప్పడం హాస్యాస్పదం. పంచాయతీలను రెండేళ్ల పాలనతో భ్రష్టు పట్టించిన రేవంత్ అభివృద్ధి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు.పాలమూరు ప్రాజెక్టులను గాలికి వదిలేశారు.రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వాలి.