Suryaa.co.in

Telangana

జనసేన తెలంగాణ విభాగంలో ప్రముఖుల చేరిక

పార్టీలో చేరిన ప్రముఖ టీవీ, సినీ నటుడు సాగర్

జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన పలు వర్గాలు పార్టీలో చేరాయి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు సాగాయి. హైదరాబాద్ నగరానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేనలో చేరారు. ఈయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు లక్కినేని సురేందర్ రావు తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. ఈయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేశారు. అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు జనసేనలో చేరారు. కోవిడ్ సమయంలో ఈ కుటుంబం పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది.

పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు వెళ్తాం
పలు ధారావాహికల్లో నటించి కుటుంబ ప్రేకక్షకులకు చేరువైన నటుడు సాగర్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సాగర్ కి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ “జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతోంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తాను” అన్నారు. ప్రేమ కుమార్, సురేందర్ రావు, ఉమాదేవి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు వెళ్తాం. తెలంగాణలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పని చేస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నేతలు రామ్ తాళ్ళూరి, రాధారం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE